
వెబ్ల్యాండ్ రికార్డుల పరిశీలన
రాయచోటి టౌన్: రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో వెబ్ల్యాండ్ రికార్డులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ శుక్రవారం పరిశీలించారు. ఏ మండలాల్లో ఎలాంటి రకాల భూములు ఉన్నాయి. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయనే విషయాల గురించి ఆరా తీశారు. ప్రధానంగా వెబ్ ల్యాండ్ రికార్డులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలకు చెందిన తహసీల్దార్లు తమ పరిధిలోని వెబ్ ల్యాండ్స్ రికార్డులను తనిఖీ చేయించుకున్నారు.
1వ తరగతి ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రాయచోటి జగదాంబసెంటర్: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమ య్యా యి. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మొదటి రోజు జిల్లాలో కేవలం 54 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ విషయమై విద్యాశాఖాధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అలాగే అన్ని సచివాలయాలు, మండల విద్యాశాఖాధికారుల కార్యాలయాలలో, రిజిస్ట్రేషన్ల కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఫోటోలు షేర్ చేయాలన్నారు.