వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలగంల్లి శ్రీనివాస్, శైలజానాథ్, మాజీ ఎంపి నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలు కోట్ల మంది జీవితాల్లో మార్పు తెచ్చాయన్నారు. ఏ పథకం తెచ్చినా ఎంతమందికి మేలు చేకూరుతుందని ఆలోచించేవారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు జరగటమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత వైఎస్సార్ది. వైఎస్సార్ పాదయాత్రతో మనిషే మారిపోయారు. అధికారంలో ఉన్న ప్రతిక్షణం జనం గురించే ఆలోచించారు
..అధికారం అనేది ఒక సేవ అని ఆలోచించే వారు. తండ్రికి మించిన పట్టుదలతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. ఎన్నో విషమ పరీక్షలు ఎదుర్కొని జనం కోసం జగన్ నిలబడ్డారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కోసం ఓదార్పు యాత్ర చేశారు. ఆ కుటుంబాలకు ఆర్ధికంగానూ అండగా నిలిచారు. ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి మేలు చేసిన వ్యక్తి జగన్. చంద్రబాబు పాలనలో ప్రజల జీవితాలు చీకటి మయంగా మారాయి. ఆ చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ జగన్ పాలన వస్తుంది

రాష్ట్రంలో జరుగుతున్నది దోపిడీ పాలన. పోలీసులను అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు పెడుతున్నారు. అమరావతి, అవినీతి అనే పేరు వినిపిస్తే సోషల్ మీడియాలో వీడియోలు కూడా తొలగిస్తున్నారు. ఇంత బరితెగింపును చూసి దేశ ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి విషపు పాలనకు ప్రజలు చరమగీతం పాడే టైం దగ్గరలోనే ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


