ఆరుబయటే భోజనం.. స్టోర్‌ రూంలో నిద్ర

Special Story On Covid Warrior Native Of Srikakulam - Sakshi

కరోనా మహమ్మారి భయాందోళన కలిగిస్తున్నా మొక్కవోని దీక్షతో విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్‌ను తుద ముట్టించడానికి ‘నేను సైతం’ అంటూ ఓ సైనికుడిలా పనిచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన సనపల కిరణ్‌కుమార్‌. లక్ష్మీనర్సుపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో హెల్త్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి కరోనా విధుల నిర్వహణలో చురుగ్గా పనిచేస్తున్న ఆయన గత కొన్ని రోజులుగా వైరస్‌ నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ప్రతీ రోజు శాంపిల్స్‌ సేకరణ, పైఅధికారులకు రిపోర్టులు పంపించడం వంటి పనుల్లో కీలకంగా మారారు
– ఎల్‌.ఎన్‌.పేట, శ్రీకాకుళం జిల్లా

ఇలా చేస్తున్నారు..
ఉదయం 9 గంటలకే విధులకు వెళుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. 
కరోనా శాంపిల్స్‌ సేకరిస్తున్నందున సాయంత్రం ఇంటికి లోపలికి వెళ్లడంలేదు. 
ఆరుబయటే భోజనం చేస్తున్నారు. స్టోర్‌ రూంలో నిద్రపోతున్నారు. 
భార్య ధనలక్ష్మి, కుమార్తె దేవశ్రీ (గోదా)లు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు.
(చదవండి: ఆ ఊరే.. ఒక సైన్యం )

ఇబ్బందులు ఎదుర్కొంటూనే..
పరీక్షల సమయంలో పీపీఈ కిట్లు ధరించి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంపిల్స్‌ సేకరించే సమయంలో ప్రజల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఓపిగ్గా ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. మహమ్మారిపై పోరాటాన్ని నిరంతరాయంగా చేస్తున్నారు.  

భయంగా ఉండేది...
‘‘నా భర్త హెల్త్‌ అసిస్టెంట్‌గా చిన్నస్థాయి ఉద్యోగమే చేస్తున్నప్పటికీ ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉంది. వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం కోసం శాంపిల్స్‌ సేకరిస్తున్నారని తెలిసి మొదట్లో కొంత భయపడ్డాం. కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటూ.. స్టోర్‌రూంలో టేబుల్‌ ఫ్యాన్‌వేసుకుని నిద్రపోవడం, ఆరుబయటే భోజనం చేయటం 
కాస్త బాధగా ఉంటోంది’’.        
– సనపల ధనలక్ష్మి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top