సాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో సముద్ర జలాల్లో అనిశ్చితి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో విశాఖ సాగరజలాల్లో రెండు రష్యాయుద్ధ నౌకలు ప్రత్యక్షం కావడం అంతర్జాతీయ చర్చకు దారి తీసింది.
రష్యానౌకాదళానికి చెందిన స్టెరెగుష్చి క్లాస్ కార్వెట్స్ అయిన షోవర్షెన్నీ, రెజ్కీ యుద్ధనౌకలు రెండు రోజుల కిందట అనధికారిక విజిట్పేరుతో విశాఖ తీరానికి చేరుకున్నాయి. రష్యా నౌకల్లో వచ్చిన సిబ్బందికి భారతనౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ నౌకల రాక వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఇండియన్ నేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఆ నౌకలు విశాఖకు ఎందుకు వచ్చాయి.. ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించే అవకాశం ఉందా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


