దుర్గమ్మను దర్శించిన మోహన్ భగవత్..
సాక్షి, విజయవాడ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధ ప్రసాదాలను అందచేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం పొందారు. భగవత్కు ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు దుర్గ గుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో నేటి నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని మోహన్ భగవత్ ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.