
నంద్యాల, సాక్షి: జిల్లా మండల పరిధిలోని చాపిరేవుల(Chapirevula)లో ఈ ఉదయం విషాదం నెలకొంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఆ ఇల్లు కుప్పకూలిపోగా.. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో పది మందికిపైగా గాయాలైనట్లు సమాచారం.

చాపిరేవులలోని ఓ ఇంట్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాద ధాటికి చుట్టుపక్కల నివాసాలు దెబ్బ తిన్నాయి. ఘటనా స్థలం నుంచి రెండు మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. వారిని వెంకటమ్మ(62), దినేష్(10)గా గుర్తించారు. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాద ధాటికి చుట్టుపక్కల నివాసాల్లోని పది మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. వీళ్లను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ స్టౌవ్ ఆన్లోనే ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.
