సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం జగన్‌  | MLC candidates comments about CM YS Jagan | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం జగన్‌ 

Feb 21 2023 2:32 AM | Updated on Feb 21 2023 2:32 AM

MLC candidates comments about CM YS Jagan - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయానికి ప్రతిరూపమని ఎమ్మెల్సీ అభ్యర్థులు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.   

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం 
ఎమ్మెల్సీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ ప్రాధాన్యతనిచ్చారు.  2014–19 మధ్య టీడీపీ శాసన మండలికి 48 మందిని పంపితే వారిలో ఓసీలే 30 మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే.  
–  కవురు శ్రీనివాస్‌ 

బాబుకి, సీఎం జగన్‌కు మధ్య తేడా ఇదే  
చంద్రబాబు 2014 19 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 37.5 శాతం పదవులే ఇచ్చారు. దీనికి భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ 68.18 శాతం కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత పట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తోంది. ఇద్దరి మధ్య ఈ తేడాను అందరూ గుర్తించాలి.     
– వంకా రవీంద్రనాథ్‌ 

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం 
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ సీఎం జగన్‌ సామాజికన్యాయానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన సీఎం జగన్‌ అభినవ పూలేగా చరిత్రలో ఉండిపోతారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.     – సిపాయి సుబ్రమణ్యం 

టీడీపీ పని అయిపోయింది 
సీఎం జగన్‌ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎమ్మెల్సీగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. టీడీపీ పని అయిపోయింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ చేతిలో మరోసారి చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ ఘోరంగా ఓడిపోవడం ఖాయం. 
– పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి 

సమస్యల పరిష్కారానికి కృషి 
శెట్టి బలిజ సామాజికవర్గంలో 36 సంచార జాతులున్నాయి. వెనుకబాటుకు గురైన వీరందరికీ న్యాయం చేస్తా. తూర్పు గోదావరి జిల్లాలో ఈసారీ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించేందుకు కృషి చేస్తా. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా.      
    – కుడుపూడి సూర్యనారాయణ 

ధైర్యం చెప్పారు 
నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నిరాశ చెందొద్దని సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేయి, న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే అడగకుండానే ఎమ్మెల్సీని చేశారు. అత్యధిక జనాభా ఉన్న వడ్డెరల అభివృద్ధికి కృషి చేస్తా.     
 – చంద్రగిరి యేసురత్నం 

ఇంత ప్రాధాన్యం ఇదే తొలిసారి 
మా జిల్లాలో మాదిగలకు ఇంత పెద్ద రాజకీయ గుర్తింపు ఇవ్వడం ఇదే తొలిసారి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దల సభకు మాదిగలు వెళ్లటం ఇదే మొదటిసారి. ఇది ఒక్క సీఎం జగన్‌ వల్లే సాధ్యమైంది.    
 –  బొమ్మి ఇజ్రాయిల్‌ 

సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది 
పరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా సీఎం జగన్‌ ఆ వర్గాల సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను శాసన మండలికి ఎంపిక చేసి సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు.    
  – పోతుల సునీత 

ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ 
జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్టీల అభివృద్ధికి సబ్‌ ప్లాన్‌లో ఈ ఏడాదిలోనే రూ.6,822.65 కోట్లు కేటాయించింది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ లో భాగంగా 2019 జూన్‌ నుంచి 2022 డిసెంబర్‌ దాకా రూ.15,589.38 కోట్లు ఖర్చు చేసింది.  2024లో జగన్‌ను సీఎంగా చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారు.      
– కుంభా రవిబాబు 

చంద్రబాబును బీసీలంతా నిలదీస్తారు 
సీఎం జగన్‌.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అనేక పదవులిస్తూ పాలనలో ప్రముఖ స్థానం కల్పిస్తున్నారు. చంద్రబాబు హయాంలో చాలా తక్కువ మందికే ఈ అవకాశం దక్కేది. ఈసారి ఎన్నికల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్‌ జగన్‌కే మద్దతిస్తారు.       
– నర్తు రామారావు 

పార్టీ విజయం కోసం పనిచేస్తా.. 
చట్ట సభలో అడుగుపెట్టే గొప్ప అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్తా. వైఎస్సార్‌సీపీ విజయం కోసం పని చేస్తా.     
– డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ 

ప్రజల గుండెల్లో.. సీఎం 
సీఎం జగన్‌ ప్రజల గుండెల్లో ఏనాడో స్టిక్కర్‌ వేసుకున్నారు. ఎంత మంది ఏకమైనా దాన్ని చెరపలేరు.  మాట తప్పని, మడమ తిప్పని గుణం వైఎస్‌ కుటుంబానిది.  
– మర్రి రాజశేఖర్‌ 

ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతాం 
సీఎం జగన్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజ­ల చెంతకు చేర్చిన వ్యక్తి ఆయన. కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో పరిపాలన సాగిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మేమందరం ముందుకు నడుస్తాం.   
 – పెన్మత్స సూర్యనారాయణరాజు 

బీసీ అంటే బ్యాక్‌బోన్‌ 
బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా సీఎం జగన్‌ గుర్తించారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు.  స్పీకర్‌గా బీసీకి అవకాశమిచ్చారు. సీఎం జగన్‌కు బీసీలంతా రుణపడి ఉంటారు.     
– కోలా గురువులు 

చంద్రబాబు నాకు ద్రోహం చేశారు  
టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాకు ద్రోహం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. కానీ ఏ హమీ ఇవ్వకుండానే సీఎం జగన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తాను. 
–  జయమంగళ వెంకటరమణ 

ఇలాంటి సీఎం దేశంలోనే లేరు 
పేదలకు ఇంతగా మంచి చేసిన సీఎం దేశంలోనే లేరు. మహిళలకు అన్నింటా అగ్రతాంబూలమే. ఏ ప్రభుత్వం చేయని మేలు చేస్తున్నారు. బీసీలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతగా మేలు జరగటంలేదు.       
– కర్రి పద్మశ్రీ 

చాలా ఆనందంగా ఉంది 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ గుర్తు పెట్టుకొని మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పదవులు బాధ్యతగా తీసుకోవాలని సీఎం జగన్‌ చెబుతారు. ఆయన చెప్పిన మాటలను శిరసావహిస్తూ బాధ్యతతో పని చేస్తా.  
– మేరుగ మురళీధర్‌ 

ఇలాంటి సీఎంను జన్మలో చూడలేను  
బీసీలకు ఇంతలా చేసిన సీఎంను ఈ జన్మలో చూడలేను. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలంతా సీఎం జగన్‌ వెంటే ఉంటారు. ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచన చేసుకుని సీఎం జగన్‌ పథకాలకు జై కొట్టాలి.   
 – ఎస్‌.మంగమ్మ  

జగనన్నతోనే న్యాయం  
జగనన్నతోనే బీసీలకు పూర్తి న్యాయం జరుగుతోంది. బడుగు, బలహీనవర్గాల దేవుడు.. జగనన్న. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు తిరిగేలా పరిపాలన సాగిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ పదవుల్లో ఏకంగా 11 బీసీలకే కట్టబెట్టారు. అలాగే 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుంటే మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. అలాగే 9 మందికి రాజ్యసభ సభ్యులుగా అవకాశమిస్తే వారిలో నలుగురు బీసీలే. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి శాసనమండలిలో కేవలం 37 శాతం మందికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది.
– వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని  

Advertisement
 
Advertisement
Advertisement