రాష్ట్రంలో 45 వేల మెడికల్ షాపులు మూసివేత
సాక్షి, అమరావతి: ఆన్లైన్ ఫార్మసీలు (ఈ– ఫార్మసీలు) నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 వేల మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు నిలిచిపోనున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిటైల్ మందుల దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. అయితే రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మందుల షాపులు తెరిచే ఉంచుతారు.
అసలు వివాదం ఏంటి?
కోవిడ్ సమయంలో మందుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది. కోవిడ్ వ్యాప్తి ముగిసినా కార్పొరేట్ సంస్థలు ఆ తాత్కాలిక వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఆన్లైన్లో నేటికీ విక్రయిస్తున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు అని మెడికల్ షాపు యజమానులు అంటున్నారు. ఈ–ఫార్మసీలు రిటైల్ మెడికల్ మార్కెట్ను ఆక్రమించుకునేందుకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
డిస్కౌంట్ల కోసమే ఆన్లైన్లో మందులు ఆర్డర్ చేస్తూ ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం షెడ్యూల్ హెచ్లోని యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించే మందులు, పెయిన్ కిల్లర్స్తోపాటు షెడ్యూల్ ఎక్స్లోని నిద్ర మాత్రలు, ఇతర మత్తు మందులకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఈ మందులు ఆన్లైన్ విక్రయాలతో దుర్వినియోగానికి గురి అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఏఐఓసీడీ బంద్కు పిలుపునిచ్చింది.


