
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భూ ఉపరితలానికి సమీప వాతావరణ పొరపై నైరుతి, పశ్చిమ దిశ నుంచి వీచే గాలుల ప్రభావం ప్రబలంగా ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కోస్తా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడుతున్నాయి. మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లగా మారుతోంది. బుధవారం ప్రకాశం జిల్లా కరవాడిలో 22.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దరిమడుగు, పునుగోడులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.