సాక్షి,కృష్ణ : మచిలీపట్నం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ రావణ్ను ఎలాగైనా సరే వదిలిపెట్టేది లేదంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వ్యూహాలు పన్నుతున్నాయి. ‘రావణ్ ఒంటిపై ఒక్క దెబ్బైనా పడాల్సిందే..’ అంటూ జనసేన అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మెసేజ్లు పంపుకుంటున్నారు. దీనికి సంబంధించిన జనసేన కీలక నేతల ఆడియో సంభాషణలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.
పోలీసు కస్టడీలో ఉన్న రావణ్ను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా రెక్కీ నిర్వహించారు. పోలీసులు రావణ్ను బయటకు తీసుకువచ్చే సమయంలోనే అతనిపై భౌతిక దాడికి పాల్పడాలనే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సార్పవరం పీఎస్, కాకినాడ కోర్టు వద్ద గురువారం జరిగిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈసారి మరింత అప్రమత్తమయ్యారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు రావణ్పై దాడి జరగకుండా ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పీఎస్ ప్రధాన గేట్లను సైతం మూసివేసి ఆంక్షలు విధించారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.


