రోబో పనితీరును వివరిస్తున్న సిబ్బంది
తొలి హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సీ అర్జున్ ప్రారంభం
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల భద్రత, రక్షణ, సేవల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ అడుగులు వేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబో ‘‘ఏఎస్సీ అర్జున్’’ను విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రైల్వే భద్రతా దళం ప్రవేశపెట్టింది. ఈ రోబోను ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్ర, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోహ్ర సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ (ఆర్పీఎఫ్) ఎ.కె.దూబె సమక్షంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం ప్రారంభించారు.
పూర్తిగా విశాఖపట్నంలోనే సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో దాదాపు ఏడాది పాటు కృషిచేసి, అభివృద్ధి చేసిన ఈ రోబోను ఆర్పిఎఫ్ ఆధునికీకరణ, డిజిటల్ మార్పు కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభించారు. ఈ ఏఎస్సీ అర్జున్ ఏఐ, ఐఓటీ, రియల్టైం మేనేజ్మెంట్ పర్యవేక్షణ, సామర్థ్యాలతో ఫేస్ ఐడెంటిటి ద్వారా నేరస్తుల గుర్తింపు, కదలికలు, అక్రమ చొరబాట్లు, ప్రయాణికుల రద్దీ, ప్రమాదాలు, నేరాలు వంటివి ముందుగానే గుర్తించి ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందజేస్తుంది.


