
పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు
మిర్చి పంటకు నష్టం
ప్రకాశం జిల్లా శంఖవరంలో గోడకూలి మహిళ మృతి
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ: దక్షిణ కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు కొద్దిమేర తగ్గాయి. పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత తగ్గినా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
54 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 43 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. సోమవారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం
ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. కనిగిరి, మార్కాపురం, కొండపి, గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలో వర్షం కురిసింది. కనిగిరి, దొనకొండ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. కనిగిరి మండలం శంఖవరంలో డబ్బుకొట్టు లక్ష్మమ్మ (52) అనే మహిళ పశుగ్రాసం కోసం వెళ్తుండగా, నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ గాలివానకు కూలి ఆమెపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.
కనిగిరిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. పీసీపల్లి, మర్రిపూడి, దర్శి, మార్కాపురం మండలాల్లోని కల్లాల్లో ఉన్న మిరపకాయలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పొన్నలూరులో పొగాకు బ్యారన్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పొదిలిలో గాలివానకు భారీ వృక్షం విరిగి కారుపై పడటంతో ధ్వంసమైంది.