చంద్రబాబు సర్కారు నిర్ణయం
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకు రూ.9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది.
రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్ కోటాకు, 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు.


