AP: 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని అన్నారు.
పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని అన్నారు.
టూరిస్ట్ పోలీస్ బూత్
అదేవిధంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. పోలీస్ బూత్తోపాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. నగరానికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రత చేకూరేల బీచ్ పోలీసింగ్ను తీర్చిదిద్దారు.
చదవండి: గోదారమ్మ మణిహారంలో కలికితురాయి