ముందస్తు చర్యలు చేపట్టడంలో చంద్రబాబు సర్కారు విఫలం
ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఫీడర్లు ట్రిప్
అవడమే కారణమంటూ తప్పించుకునే యత్నం
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిసినా అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దీంతో విద్యుత్ను సక్రమంగా అందించలేకపోతోంది. సాంకేతిక సాకులు చూపించి జనానికి కోతలు తప్పవని సంకేతాలిస్తోంది. విద్యుత్ కోతలపై శనివారం మంత్రి రవికుమార్ చేపట్టిన సమీక్షలో అధికారులు చెప్పిన సాంకేతిక కారణాలే దీనికి తార్కాణం. ‘‘అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి..అకాల వర్షాల కారణంగా సమస్యలు తలెత్తి ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. అందుకే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.’’ అని విద్యుత్ పంపిణీ సంస్థలు సమాధానం చెప్పడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు అమలు చేయడంపై ‘సాక్షి’ కథనాలకు స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం డిస్కంల సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విద్యుత్ కోతలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదన్నారు.
గత ప్రభుత్వంలో ఇబ్బంది లేదే
2023 మే నెలలో భానుడి భగభగలు, వర్షాలు, ఈదురుగాలులు వంటి విపత్తుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎండల వల్ల అవుట్డోర్ వర్క్స్ ఆపేశారు. ఇళ్లల్లో ఏసీలు, ఎయిర్ కండిషనర్ల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడింది. రోజుకి విద్యుత్ వినియోగం 255 మిలియన్ యూనిట్లకు చేరింది. అయినా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. కరెంట్ వాడకం రోజురోజుకూ పెరిగినా గ్రిడ్ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండేలా చూసింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచింది. దీంతో వేసవిలో కూడా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించింది.


