సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం కేసు విషయమై హోంశాఖకు టెన్షన్ పట్టుకుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
నకిలీ మద్యం కేసు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నుంచి సీబీఐకి వెళ్తే.. టీడీపీ నాయకుల పేర్లు బయటకి వస్తాయని పచ్చ పార్టీ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు.. కౌంటర్ దాఖలు చేస్తే సీబీఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారు అనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే, నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సీబీఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే.
దీనికి ముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు.
మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.

దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు
ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.


