కరోనా కట్టడిపై సీఎం జగన్‌ సమీక్ష

Ap: Cm Ys Jaganmohanreddy Held Meeting Corona Control Officers - Sakshi

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు

ఆ మేరకు టెండర్లు లోడ్‌ చేసిన అధికారులు

బిడ్ల దాఖలుకు 3 వారాల గడువు

300 టన్నుల  ఉత్పత్తి సామర్ధ్యంతో  ఆక్సిజన్‌ ప్లాంట్‌

ఆ మేరకు‌ యుద్ధప్రాతిపదికన చర్యలు : సీఎం

45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌

మొదటి డోస్‌ పూర్తైన వారికి ప్రాధాన్యం

వారికి రెండో డోస్‌ తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్‌

సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, తాడేపల్లి( గుంటూరు) : రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌  డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్‌కుమార్‌ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌:
భవిష్యత్తులో కూడా మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రోజుకు ప్రస్తుతం మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం 600 టన్నులు దాటిన దృష్ట్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని సీఎం జగన్‌ తెలిపారు.. రాష్ట్రంలో ప్రతిపాదిత కృష్ణపట్నం స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, కడపలో ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగపడేలా, అదే సమయంలో రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఒక ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నిర్మించే ఆలోచన చేయాలన్నారు. కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ యుద్ధప్రాతిపదికన తీసుకొచ్చే విషయమై దృష్టి పెట్టాలన్న సీఎం జగన్‌...కనీసం 300 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఆ ప్లాంట్‌ ఉండాలన్నారు.ఇప్పుడున్న ఆక్సిజన్‌కు ఇది అదనం అవుతుందని తెలిపారు.

ఆక్సిజన్‌ సేకరణ, సరఫరా, నిల్వపై సమీక్ష:
ఏప్రిల్‌ 20 నాటికి 360 మెట్రిక్‌ టన్నులు కేటాయింపులు ఉంటే ప్రస్తుతం వినియోగం సుమారు 600మెట్రిక్‌ టన్నులకు పైగా చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 టన్నులు వరకూ ఉన్నాయన్న అధికారులు.. ప్రత్నామ్నాయ విధానాల ద్వారా ఆ లోటు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్‌ స్టోరేజ్‌ ట్యాంకులు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.

లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనాల సంఖ్యను 56 నుంచి 78కు పెంచామన్న అధికారులు.ట్యాంకరు రాగానే దాని నుంచి రీఫిల్‌ చేసి పంపిణీ చేయడానికి మరో 14 వాహనాలను ఏర్పాటు చేశామన్న అధికారులు.పాత వాహనాల్లో ఉన్న ట్యాంకర్లకు మరమ్మత్తులు చేసి 44 కిలోలీటర్ల స్టోరేజీని ఏర్పాటు చేశామన్న అధికారులు. ఒడిశాలోని వివిధ కర్మాగారాల నుంచి రోజుకు 210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ తీసుకు రావడానికి 36 వాహనాలను వినియోగిస్తున్నామన్న అధికారులు.ఇందులో నాలుగు వాహనాలను ప్రతిరోజూ విజయవాడ నుంచి వైమానిక దళం విమానం ద్వారా భువనేశ్వర్‌కు ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తున్నామన్న అధికారులు.రాష్ట్రానికి 2 ఐఎస్‌ఓ ట్యాంకర్లు వస్తున్నాయని, వాటిని దుర్గాపూర్‌లో ఆక్సిజన్‌ నింపి తీసుకొస్తున్నామన్న అధికారులు.వచ్చే నెల (జూన్‌) మధ్యంతరానికి మరో 25 ట్యాంకర్లు వస్తున్నాయన్న అధికారులు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సామర్థ్యం పెంచండి:
ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లకు అనుగుణంగా సరైన ప్రెజర్‌తో ఆక్సిజన్‌ వెళ్లేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.నేవీ, ఇతర సాంకేతిక సిబ్బంది సహాయం తీసుకుని ప్రెజర్‌ తగ్గకుండా అందరికీ సమరీతిలో ఆక్సిజన్‌ వెళ్లేలా చూడాలని ఈ సందర్భంగా సూచించారు. దీని కోసం అవసరమైన పరికరాలను  సమకూర్చుకోవాలని ఆదేశించారు.  కాగా, ఆస్పత్రిలో పైపులైన్లను పరిశీలించి, అవసరమైన మార్పులు చేస్తున్నామని, అదే విధంగా పైపులైన్‌ వ్యవస్థను మెరుగుపరచడానికి నేవీ సహకారం తీసుకుంటున్నామని తెలిసిన అధికారులు.

జర్మన్‌ హ్యాంగర్లు:
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆస్పత్రులకు వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా వాటి ఆవరణల్లో జర్మన్‌ హేంగర్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్కడున్న ఏరియాను బట్టి కనీసం 25 నుంచి 50 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ జర్మన్‌ హేంగర్ల ఏర్పాటు  పూర్తవుతుందని స్పష్టం చేశారు.

ఆస్పత్రులు–బెడ్లు:
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం 669 ఆస్పత్రులను గుర్తించగా, వాటిలో మొత్తం 47,693 బెడ్లు ఉండగా, వాటిలో 39,749 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, వాటిలో సగానికి పైగా, అంటే 26,030 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక అన్ని ఆస్పత్రులలో ఐసీయూ బెడ్లు 6513, నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌‌ బెడ్లు 23,357, నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు 17,823 ఉన్నాయన్న అధికారులు మొత్తం 3460 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. 

గతేడాది సెప్టెంబరులో కరోనా తొలిదశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కోవిడ్ చికిత్స కోసం 261 ఆసుపత్రులను గుర్తించగా... వాటిలో మొత్తం 37,441 బెడ్లు, 2279 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా... ఇప్పుడు వాటి  సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 669  ఆస్పత్రులను కోవిడ్ చికిత్స కోసం గుర్తించగా... వాటిలో 47,693 బెడ్లుతో పాటు 3,460  వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. 

హ్యూమన్‌ రిసోర్స్‌ (హెచ్‌ఆర్‌):
కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు. జీడీఎంఓ. స్టాఫ్‌ నర్సులు. టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు కలిపి మొత్తం 17,901 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వివరించారు.

అత్యవసరాలు–అందుబాటు:
అన్ని జిల్లాలలో కలిపి ఇప్పుడు ఎన్‌–95 మాస్కులు 6,42,911, పీపీఈ కిట్లు 7,18,086. సర్జికల్‌ మాస్క్‌లు 38,26,937.  హోం ఐసొలేషన్‌ కిట్లు  82,884. రెమిడిస్‌విర్‌ ఇంజక్షన్లు  21,340 ఉన్నాయని అధికారులు తెలిపారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు:
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 75,49,960 కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వచ్చాయి. వాటిలో కోవీషీల్డ్‌ 62,60,400 కాగా, కొవాక్సిన్‌ 12,89,560 డోస్‌లు ఉన్నాయి.

గ్లోబల్‌ టెండర్లు:
రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిల్చినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సీన్లు సరఫరా చేసే కంపెనీలు మూడు వారాల్లో తమ బిడ్లు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

అందుబాటులోకి మరిన్ని సదుపాయాలు:
సీఎం ఆదేశాలతో కోవిడ్‌ రోగులకు అందుబాటులోకి రానున్న మరిన్ని మౌలిక సదుపాయాలు.
15 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌, 10 వేల డి-టైప్‌ సిలెండర్లను త్వరలోనే ఆస్పత్రులకు అందుబాటులోకి అదనంగా 250 వెంటిలేటర్ల ఏర్పాటు, వాటిలో ఇప్పటికే 50 సరఫరా చేశామన్న అధికారులు.
125 కిలోలీటర్ల మెగా స్టోరేజీ ట్యాంకు కోసం విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్న  అధికారులు.
దీన్ని ప్రతిపాదిత ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌ వద్ద పెట్టించాలన్న సీఎం.
కొత్తగా 6500 మెడికల్‌ గ్యాస్‌ పైపులైన్ల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం..రాష్ట్రంలోని 53 చోట్ల పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు.

( చదవండి: వ్యాక్సిన్‌ కోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమే )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top