వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

AP CM YS Jagan Review With Flood Affected Districts Collectors - Sakshi

శిబిరాల్లో ఉన్న వారు ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వండి 

104కు వచ్చే కాల్స్‌పై అధికారులు స్పందించి బాధితులకు తోడుగా నిలవాలి

ఇల్లు నిర్మించుకునేందుకు వీరికి రూ.1,80,000 కూడా ఇవ్వాలి.  

సాక్షి, అమరావతి: వరదలతో ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని, ఎవ్వరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వరద బాధితులపట్ల ఉదారంగా ఉండటంతోపాటు మానవతా దృక్పథాన్ని చూపించాలని ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాలపై సోమవారం సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులను ఆదుకోవడంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆయనేమన్నారంటే.. 

గ్రామ, వార్డులు యూనిట్‌గా సాయం 
‘వరద బాధితులకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు ఇవ్వాలి. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి. వలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి ఎక్కడా లోటు రానీయకుండా మంచి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి. అలాగే, ఈ శిబిరాల నుంచి వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి. విద్యుత్, రక్షిత తాగునీటి పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. విద్యుత్‌ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు. సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.  

104కు వచ్చే సమస్యలపై వెంటనే స్పందించండి 
104 కాల్‌ సెంటర్‌ గురించి ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండి. ఈ నంబర్‌కు ఎలాంటి సమాచారం వచ్చినా అధికారులు స్పందించి బాధితులకు తోడుగా ఉండాలి. జిల్లాల్లో ‘104’కు ప్రత్యేక అధికారిని నియమించాలి. 

మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలు  
నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలి. విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మిగిలిన వారిలో ధైర్యం నింపడానికే ఈ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి.  

పంట నష్టం ఎన్యూమరేషన్‌ మొదలుపెట్టాలి 
పంటల నష్టం ఎన్యూమరేషన్‌ వెంటనే మొదలు పెట్టాలి. రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి. అంతేకాక.. మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం. ఇందుకు చర్యలు తీసుకోవాలి. పశువులు మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాలి. 

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి 
చెరువులు, ఇతర జలాశయాలు, కట్టల మీద దృష్టి పెట్టాలి. ఈ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్లు చెబుతున్నారు. అయినా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం. ఇక వరదలతో గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి.’  

ఈ సమీక్షలో హోంమంత్రి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌ కె.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వారికి రూ.95 వేలు 
ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. బాధితులకు వెంటనే నగదు ఇవ్వాలి. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ.95,100 నగదు ఇచ్చి వీరికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలి. అలాగే, ఇల్లు నిర్మించుకునేందుకు వీరికి రూ.1,80,000 కూడా ఇవ్వాలి. దీనివల్ల వారు వెంటనే ఇంటి పనులు మొదలుపెట్టగలుగుతారు. అలాగే, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200ల నగదు వెంటనే అందించాలి.

రోడ్ల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ముందు తాత్కాలిక పనులు వెంటనే పూర్తిచేయాలి. శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలి. ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలి. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లు ఖరారుచేసి పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top