విజయనగరంలో విషాదం.. చందక గోవింద్‌ మృతి

AP Chandaka Govind Died In Navy Training Accident At West Bengal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్‌(31) మృతిచెందారు. దీంతో, గోవింద్‌ స్వగ్రామం విజయనగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పారాచ్యూట్‌ తెరుచుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నేవీ అధికారులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. ఇక, బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

ఇదిలా ఉండగా.. పనాగఢ్‌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తులలో పాల్గొంటాయి. పారాట్రూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్.. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమయ్యారని భారత వైమానిక దళం తెలిపింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. కాగా, చందక గోవింద్ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. మరోవైపు.. రేపు స్వగ్రామానికి చందక గోవింద్ మృతదేహం చేరుకోనుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top