కన్నీటి వరద.. వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 23 గల్లంతు.. 9 మంది మృతి

9 Died, 23 People Missing In AP Floods - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: భారీవర్షాలతో పోటెత్తిన వరద వైఎస్సార్, చిత్తూరు జిల్లాలను ముంచెత్తింది. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి. తిరుమలలో వరద భయం కలిగిం చింది. తిరుపతి విలవిల్లాడింది. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయు గుండం నేపథ్యంలో కురిసిన వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి.

540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 23 మంది గల్లంతయ్యారు. వీరిలో 9 మంది మృతదేహాలు లభించాయి. వైఎస్సార్‌ జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ఊళ్లను ముంచేసింది. నాలుగు బస్సులు నీళ్లల్లో చిక్కుకున్నాయి. ఒక బస్సులో కండక్టరు, ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. పెద్దసంఖ్యలో మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయి. ఏపీ సీఎం  ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు. 


వైఎస్సార్‌ జిల్లా రాజంపేట మండలం రామాపురం వద్ద వరదనీటిలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు

మట్టి కట్టలు తెగడంతో..
పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోవడంతో చెయ్యేరు నది లక్షల క్యూసెక్కుల వరదతో వరదతో పరవళ్లు తొక్కింది. వరదకు పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్‌ తెగిపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో అన్నమయ్య ప్రాజెక్టులోకి ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి పడింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కొట్టుకుపోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరదనీరు అతి వేగంగా దూసుకువస్తూ గ్రామాలపైకి వచ్చేసింది. ఆ గ్రామాల్లో ప్రజలు తేరుకుంటుండగానే ఇళ్లను ముంచెత్తింది.  

మిద్దెలపైకి, సురక్షిత ప్రాంతాలకు చేరుకోలేకపోయిన పలువురు గల్లంతయ్యారు. వారిలో కొంతమంది సుదూర ప్రాంతాల్లో గట్టుకు చేరినట్లు సమాచారం. ఈ వరద ప్రవాహంలో 18 మంది గల్లంతయ్యారు. వీరిలో ఎనిమిదిమంది మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు.  మందపల్లె గ్రామంలో శివాలయం ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఊళ్లోకి వరద వస్తున్నట్లు తెలియడంతో ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు దక్కించుకునేందుకు ట్రాక్టర్‌లో శివాలయంలోకి వెళ్లారు. వరద శివాలయాన్ని ముంచెత్తింది. పురోహితులైన అన్నదమ్ముల కుటుంబాల్లో తొమ్మిదిమంది గల్లంతయ్యారు.

వీరిలో కాంతమ్మ మృతదేహం లభించింది. రాజంపేట–నందలూరు మార్గంలో రామాపురం చెక్‌పోస్టు సమీపంలో 4 బస్సులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. వీటిలో రెండు ఆర్టీసీ బస్సులు, ఒక అద్దె బస్సు, ఒక ప్రైవేట్‌ బస్సు ఉన్నాయి. అద్దె బస్సు నీటి ఉధృతికి కల్వర్టులోకి కొట్టుకుపోయి కండక్టర్‌ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనివాసులు, లక్కిరెడ్డిపల్లెకు చెందిన వెంకటరమణ మృతి చెందారు. మిగిలిన 3 బస్సుల డ్రైవర్లు, ప్రయాణికులు 27 మంది బస్సుల పైకి ఎక్కారు. వారిని రెస్క్యూ బృందం రక్షించింది.


నెల్లూరు జాతీయ రహదారి పక్కన భగత్‌సింగ్‌నగర్‌ కాలనీని చుట్టుముట్టిన వరద నీరు 

స్వర్ణముఖిపై కూలిన వంతెనలు
తిరుమల కొండల్లోంచి వచ్చిన నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. తిరుమలలోని గోగర్భం డ్యాం, పాపనాశనం డ్యాం నిండిపోయాయి. దీంతో డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఆ నీటితో పాటు... కొండల్లో నుంచి దుమికే వరద నీరు తిరుపతి కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కపి లేశ్వరస్వామి ఆలయం వరద నీటితో నిండి పోయింది. ఆ వరద నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. మాల్వాడీగుండం కాలువ పొంగి ప్రవహించింది. ఫలితంగా తిరుపతి నగరంలోని సుమారు 70 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకు న్నాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. కళ్యాణి డ్యాం గేట్లు ఎత్తేయడంతో స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తోంది.

పరీవాహక ప్రాంతంలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుచానూరు వసుంధరానగర్‌లో నది సమీపంలోని నిర్మించిన రెండతస్తుల భవనం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. చంద్రగిరి–శ్రీకాళహస్తి మధ్యలో స్వర్ణముఖి నదిపై ఏడు వంతెనలు కొట్టుకుపోయాయి. కేవీపల్లి వద్ద పింఛా నది కట్ట తెగిపోయింది. కౌండిన్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బహుదానది ప్రవాహంతో కాణిపాకం ఆలయం జలమయమైంది.  జిల్లాలో 540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు, కర్ణాటకకు కొన్ని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బంగారుపాళెం వద్ద నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది.   

తిరుమల ఘాట్‌ రోడ్ల మూసివేత
కొండచరియలు విరిగిపడటం, పొగమంచు కారణంగా తిరుమల ఘాట్‌ రోడ్లను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి మూసివేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రోడ్లను పునఃప్రారంభించే సమయాన్ని తరువాత ప్రకటించనున్నట్లు తెలిపింది. విరిగిపడ్డ చరియలను తొలగించి శుక్రవారం రాకపోకలకు అనుమతి ఇచ్చారు. శ్రీవారి దర్శనాలకు అనుమతులు ఉండి వర్షం కారణంగా రాలేని భక్తులకు మరోసారి అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈఓ ప్రకటించారు.  

మత్య్సకారులను రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం సమీపంలో పెన్నానదిలో చిక్కుకున్న 17 మంది మత్స్యకారులను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు శుక్రవారం అర్ధరాత్రి కాపాడాయి. సాయంత్రం వేటకు వెళ్లినవారు తాము చిక్కుకుపోయినట్లు వీడియోతీసి వాట్సాప్‌లో పోలీసులకు పంపడంతో రెస్క్యూ బృందాన్ని రప్పించి వారిని రక్షించారు. వరద చుట్టుముట్టిన కోలగట్ల గ్రామంలో ఒక భవనంలో చిక్కుకున్న 30 మందిని కూడా రక్షించారు.  ముంబై–చెన్నై మార్గంలో వైఎస్సార్‌ జిల్లా నందలూరు రైల్వేసెక్షన్‌లోని హస్తవరం డిస్టింట్‌ సిగ్నల్‌ సమీపంలో డబుల్‌ లైన్‌ రైల్వే ట్రాక్‌ కిలోమీటరు మేర కొట్టుకుపోయింది. రైల్వే విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.   

హెలికాప్టర్‌ సాయంతో 10 మందిని రక్షించిన యంత్రాంగం
కుండపోత వర్షాలతో అనంతపురం జిల్లా అత లాకుతలమైంది. పెన్నా, చిత్రావతి, కుముద్వతి, పాపాఘ్ని, జయమంగళి, కుశావతి, సోమావతి నదులు, మద్దిలేరు, పండమేరు, కూతలేరు లాంటి ప్రధాన వాగులు పరవళ్లు తొక్కుతు న్నాయి. అతిభారీ వర్షాలతో కదిరి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. వేలాది ఎక రాల్లో పంటలు నీటమునిగాయి. తాడిమర్రి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) ఆరుగేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదలుతున్నారు.

చెన్నే కొత్తపల్లి మండలంలో చిత్రావతి నదిలో కారు, జేసీబీ చిక్కుకుపోగా 10 మంది బిక్కుబిక్కు మంటూ గడిపారు. ఈ విషయాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చొరవతో బెంగ ళూరు నుంచి వైమానికదళ హెలికాప్టర్‌ వచ్చి వారిని రక్షించింది. పరిగి, ధర్మవరం ప్రాంతాల్లో వరద నీటిలో 10 మంది చిక్కుకున్నారు. 

వరద సాయంలో ఉదారంగా ఉండండి: ఏపీ సీఎం 
భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంపు బాధితులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.రెండు వేల చొప్పున ఇవ్వాలని, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని సూచించారు. అలాగే.. భారీ వర్షాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన సూచించారు.

బాధితులను ఆదుకోవడంలో మొక్కుబడిగా కాకుండా మానవతా ధృక్పథంతో వ్యవహరించాల న్నారు.   కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్రం పూర్తి అండగా ఉంటుందని, ఏ సహాయం కావాలన్నా కోరాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం జగన్‌కు భరోసా ఇచ్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top