అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలతో కలెక్టరేట్ అట్టుడికింది. హామీల అమలుకు... సమస్యల పరిష్కారానికి... డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు, మునిసిపల్ పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, రైతు కూలీ సంఘం నాయకులు వేర్వేరుగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలకు ఆయా సంఘాల నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేయాలి..
సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్దసంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు, సంఘం గౌరవాధ్యక్షుడు నాగేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.7 వేలు వేతనం మాత్రమే వస్తోందని, అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వ లేదన్నారు. ప్రతి అంగన్వాడీకి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించాలి
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాంటూ మునిసిపల్ కార్మిక, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికులు సోమవారం కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, నాయకులు వెంకటనారాయణ, ముత్తూజ, గోపాల్, ఏటీఎం నాగరాజు, తదితరులు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలన్నారు. పెరిగిన నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. శాశ్వత ఉద్యోగులకు ఇచ్చిన జీఓ 1615 ప్రకారం బేసిక్ వేతనంతో పాటు హెచ్ఆర్ఏ, డీఏ ఇవ్వాలన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాల అమలు కోసం
అంగన్వాడీల బైఠాయింపు
జీఓ 36 అమలు చేయాలంటూ
ఇంజినీరింగ్ కార్మికుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలని
పారిశుధ్య కార్మికుల ఆందోళన
డిమాండ్ల సాధనకు మునిసిపల్
ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
రైతుల సమస్యలు పరిష్కరించాలని
ఏఐకేఎంఎస్ ధర్నా
జీఓ 36 మేరకు వేతనాలివ్వాలి
మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీఓ 36 మేరకు వేతనం ఇవ్వాలంటూ మునిసిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కమిటీ నాయకులు మల్లికార్జున, వీఎస్ రాయుడు, మురళీమోహన్, ఓబుళపతి, పోతులయ్య, తదితరులు మాట్లాడారు. 36 జీఓ ప్రకారం కార్మికులకు కేటగిరీ వారీగా రూ.21 వేలు, రూ.24,500 అమలు చేయాలన్నారు. కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. కార్మికులకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయి తక్షణం చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే జూలై 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
జీతం పెంపుదల, తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏపీ మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మిక సంఘం, ఐఎఫ్టీయూ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయుడు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి సురేష్, ఎసీ సంఘం నాయకుడు సాకే హరి మాట్లాడారు. టెక్నికల్ కార్మికులకు రూ.29,200, నాన్ టెక్నికల్ కార్మికులకు రూ.24,500 వేతనం ఇవ్వాలన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు 62 ఏళ్లకు ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించాలన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మరణించి కార్మికునికి రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతు, రైతు కూలీల ధర్నా
రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించాలంటూ అఖిల భారత రైతుల కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శి కిష్ట, కోశాధికారి రాయుడు, సభ్యుడు రామాంజనేయులు మాట్లాడారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం రూ.20 వేలు తక్షణం ఇవ్వాలన్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్ల బిగించకూడదన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటిస్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచి, రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్
ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్
ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్
ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్