
ఇలా.. ఇంకెన్నేళ్ల్లు?!
అనంతపురం కార్పొరేషన్: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తున్న తమ సేవలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. పదోన్నతులు కల్పించకుండా బదిలీలు చేపట్టాడాన్ని నిరసిస్తూ సోమవారం అనంతపురంలోని మున్సిపల్ ఆర్డీ కార్యాలయాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అండగా నిలుస్తామని పాలకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. సర్వీస్ రూల్స్ కల్పించాలని, క్యాడర్ గుర్తింపు, పదోన్నతి, టెక్నికల్ పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జాబ్ చార్ట్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసంబద్ధమైన జీఓ 423ను రద్దు చేసి, పారిశుద్ధ్య కార్యదర్శులకు న్యాయం చేయాలన్నారు. సర్వేల భారం తగ్గించాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్, డీఏ, పీఆర్సీలను అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్కు అందించారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, లక్ష్మి, నరేష్, నారాయణ, వరప్రసాద్, హనుమంతు, మల్లికార్జున, శివశంకర్, వినయ్, నరేష్, భగీరథ రెడ్డి, విమల, మౌలాలమ్మ, హారతి, శశికళ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
మునిసిపల్ ఆర్డీ కార్యాలయం ఎదుట ధర్నాలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు