
జననాలంటే ‘లెక్కే’లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రైవేటు ఆస్పత్రుల విచ్చలవిడితనం రకరకాల ఇబ్బందుకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో అయినా మారుమూల గ్రామానికి చెందిన మహిళ ప్రసవించినా తల్లీ బిడ్డ వివరాలు నమోదు చేయాలనేది నిబంధన. కానీ మిస్సింగ్ రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జరుగుతున్న ప్రసవాలకు, నమోదవుతున్న వాటికీ పొంతన లేకుండా పోయింది. దీంతో కేంద్రం నుంచి ప్రసవ సమయంలో వచ్చే లబ్ధి కూడా జరగకుండా పోతోంది. జనాభా లెక్కల్లోనూ భారీ తేడా చోటు చేసుకుంటోంది.
8,661 మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు..
2024–25 సంవత్సరంలో జిల్లాలో వాస్తవానికి 48,224 డెలివరీలు జరిగినట్టు సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం)లో నమోదైంది. ఈ సంఖ్య ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్)లో 34,858గా ఉంది. ఒక్కో కేంద్రం పోర్టల్లో ఒక్కో రకంగా సంఖ్య నమోదై ఉంది. జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే డెలివరీలు, గర్భిణుల నమోదు తప్పుల తడకగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 8,661 ప్రసవాలు అసలే నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఎంతమంది పుడుతున్నారు, ఎవరికి ఎలాంటి లబ్ధి జరుగుతోందన్నది తెలియడం లేదు.
2,800కు పైగా అబార్షన్లు..!
జిల్లాలో మిస్సింగ్ ప్రసవాలే కాదు అబార్షన్లు కూడా గుట్టుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రమారమి 2,800కుపైగా అబార్షన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగినట్టు తెలిసింది. వాస్తవానికి ప్రసవం లేదా అబార్షన్ ఏదైనా నమోదు చేసి జిల్లా ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)కు సమాచారం ఇవ్వాలి. ఎందువల్ల అబార్షన్ చేయాల్సి వచ్చిందనేది నివేదికలో పొందుపరచాలి. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాయి. లింగనిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేస్తున్నట్టు కూడా విమర్శలొస్తున్నాయి. ఓవైపు జననాల రేటు తగ్గిపోతుంటే ప్రైవేటు వైద్యులు అబార్షన్లు చేసి మరింత తగ్గిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం బర్త్రేటు 1.5 కంటే తక్కువగా నమోదవుతోంది.
2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకూ ప్రసవాల నమోదు ఇలా..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,591
ప్రైవేటు ఆస్పత్రుల్లో 20,481
ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదైనవి 34,858
సీఆర్ఎస్లో నమోదైనవి 48,224
మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ 8,661
(ఒక్కో పోర్టర్లో ఒక్కో రకంగా నమోదు కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది)
ప్రైవేటు ఆస్పత్రుల మాయాజాలం
ప్రసవాల రిజిస్ట్రేషన్స్లో అవకతవకలు
నమోదులో లేని
8,661 ప్రైవేటు ఆస్పత్రుల ప్రసవాలు
రాష్ట్రంలో అత్యధికంగా
మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు జిల్లాలోనే
నర్సింగ్ హోంలలో జరిగే ప్రతి ప్రసవంపై సమాచారం ఇవ్వాలని నిబంధన
ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకంతో
జనగణనలో ఇబ్బందులు