
ఇన్చార్జ్ అధికారులే దిక్కు
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఇన్చార్జ్ అధికారులే దిక్కు కావడంతో పాలన కుంటుపడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని కీలక శాఖలకు రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒక్కొక్కరు రెండేసి మండలాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరించాల్సి వస్తోంది.
తహసీల్దార్లు లేకపోవడంతో..
ఉరవకొండ రెగ్యులర్ తహసీల్దార్గా మహబూబ్బాషా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడేరుకు రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో ఆయన్ను ఆ మండలానికి ఇన్చార్జ్గా నియమించారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న కూడేరు నుంచి ఉరవకొండకు 25 కిలోమీటర్లు అవుతుండటంతో ఆయన రెండు మండలాలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కూడేరులో 8 నెలలుగా తహసీల్దార్ పొస్టు ఖాళీగా ఉంది. దీంతో పాటు కార్యాలయంలో సీఎస్డీటీ, సీనియర్ అసిస్టెంట్ పొస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అలాగే ఉరవకొండ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన బోగన్నగౌడ్ కేవలం నెల రోజులు మాత్రమే పనిచేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. విడపనకల్లు తహసీల్దార్ సునీతాబాయి డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతిపై మరో జిల్లాకు వెళ్లిపోవడంతో తహసీల్దార్ పొస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం సివిల్ సప్లయ్స్ డీటీ ఇన్చార్జ్గా ఉన్నారు. వజ్రకరూర్ తహసీల్దార్ నయాజ్అహ్మద్ ఈనెల 30తో పదవీ విరమణ పొందుతుండటంతో అక్కడ కూడా డిప్యూటీ తహసీల్దార్ నరేష్కు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. వజ్రకరూర్కు రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడంతో ఉరవకొండ ఎంపీడీఓ రవిప్రసాద్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఉరవకొండ ఉపాధి హమీ పథకం ఏపీడీ పొస్టు ఖాళీగా ఉండటంతో తాడిపత్రికు చెందిన రెగ్యులర్ ఏపీడీను ఉరవకొండ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. బెళుగుప్ప ట్రాన్స్కో ఏఈ గంగధర్ కంబదూరు మండలానికి ఇన్చార్జ్ ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రజల అవస్థలు..
నియోజకవర్గంలోని ప్రధాన కార్యాలయాల్లో తహసీల్దార్, ఎంపీడీఓలు లేకపోవడంతో పాలన కుంటు పడింది. ఇన్చార్జ్ పాలనతో పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు సేవలందక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ దీనిపై దృష్టి పెట్టి రెగ్యులర్ ఉద్యోగులను నియమించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మంత్రి పయ్యావుల ఇలాకాలో
సేవలు అందక ప్రజల ఇబ్బందులు
కీలక పొస్టులకు అధికారులు లేక
కుంటుపడిన పాలన