
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
● కేతిరెడ్డి పెద్దారెడ్డిని
టార్గెట్ చేసిన జేసీ వర్గం
● జేసీ ఇంటి సమీపంలోని పాఠశాల
ప్రాంగణంలో రాళ్లకుప్పలు
● తీసివేయించేందుకు శతవిధాలా
ప్రయత్నిస్తున్న పోలీసులు
సాక్షి టాస్క్ఫోర్స్: తాడిపత్రిలో మళ్లీ టెన్షన్ సీన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు గురువారం టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐ సాయిప్రసాద్ పలుమార్లు జేసీ ఇంటి పరిసరాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో ఉంచిన రాళ్లను తొలగించాలని జేసీ ప్రభాకర్రెడ్డికి సూచించినా ఆయన ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులే రాళ్లను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు పాఠశాల మైదానంలో పోలీసులు సిబ్బందితో బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు.
స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
రాప్తాడు: జిల్లాలో ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఎం.బండమీదపల్లిలో పర్యటించారు. తొలుత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. లబ్ధిదారుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అవసరమైతే చేస్తామని హామీ ఇచ్చారు. లాలాసాహెబ్పల్లి వద్ద ఉన్న చెరువులో ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. స్వయంగా గడ్డపార చేతబట్టి ఉపాధి పనులు చేశారు. ఉపాధి పనులు నాణ్యతగా చేస్తే.. పనికితగ్గ వేతనం అందుతుందని కూలీలకు సూచించారు. కూలీలకు ఏదైనా ప్రమాదాలు జరిగితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాలు తోడుగా ఉంటాయన్నారు. రూ.2.30 లక్షలతో గోవింద్ అనే పాడి రైతు నిర్మించుకున్న పశువుల షెడ్డును ప్రారంభించారు. ప్రతి ఒక్కరి ఇంటి వద్ద ఇంకుడి గుంత, పొలంలో ఫారంపాండ్, ఇంటి వద్ద పశువులు ఉండాలన్నారు. అనంతపురం జిల్లాలో 1400 పైగా గోశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. లాలాసాహెబ్ పల్లి వరకు తారు రోడ్డు, ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణం తదితర సమస్యలపై గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డ్వామా పీడీ సలీం బాషా, డీపీఓ నాగరాజు నాయుడు, సీఈఓ రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, డీఎల్డీఓ లలితాబాయి, ఎంపీడీఓ విజయలక్ష్మి, డీఎల్పీఓ విజయకుమార్, సర్పంచ్ ఉమాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్