
ఈ పాపం చంద్రబాబుదే!
అనంతపురం కల్చరల్: ‘చంద్రబాబు పాలన వచ్చిందంటే ఆలయాల్లో అలజడి పరిపాటిగా మారింది. తరుచూ భక్తుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఆలయాలలోనూ అవినీతి, అక్రమాలకు తావిస్తున్నారు’ అంటూ హిందుత్వ సంఘాలు మండిపడ్డాయి. సనాతన భారతీయ సంస్కృతికి నిలయమైన ఆలయ వ్యవస్థ ప్రతిష్ట చంద్రబాబు పాలనలో దిగజారిపోతోందంటూ ఈసడించుకున్నాయి. తప్పు జరిగిన ప్రతి సారీ సామాన్య ఉద్యోగులనే బలి చేసి, పెద్దలను కాపాడుతున్న వైనాన్ని తప్పుబడుతున్నాయి. ఇంకా బయట ప్రపంచానికి తెలియని ఎన్నో ఘోరాలు, అమానుషాలు ఆలయాలలో నిత్యకృత్యమవుతంటే హిందుత్వ సంఘాలు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు భగ్గుమంటున్నారు.
గత ఘటనల నుంచి నేర్చుకోని పాఠాలు..
గత టీడీపీ పాలన నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకూ ప్రముఖ ఆలయాలు అపవిత్రమవుతూ వస్తున్నాయని బ్రాహ్మణసంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. 20154లో అధికారం చేపట్టిన చంద్రబాబు.. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తన పబ్లిసిటీ పిచ్చితో చేపట్టిన షూటింగ్ వల్ల జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు మృతి చెందారన్నారు. ఇదే ఘటనలో మరో 51 మంతి తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు. 2016లో తిరుమల క్యూలైన్లో నారాయణగిరి షెడ్డు వద్ద విద్యుత్ షాక్కు గురై ఇద్దరు భక్తులు మృతి చెందారన్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2018లో పందిళ్లు కూలడంతో విద్యుత్ షాక్కు గురై నలుగురు భక్తులు మృతిచెందారని, మరో 70 మంది గాయపడ్డారని గుర్తు చేశారు. ఈ ఏడాది తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 8న తిరుపతిలోని బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందాదరన్నారు. మరో 40 మంది గాయపడ్డారని తెలిపారు. తాజాగా సింహాచలం చందనోత్సవం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిసినా... రెండు రోజలు క్రితం నిర్మించిన గోడ కుప్పకూలడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారన్నారు. ఈ పాపం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు.
మంత్రి రాజీనామా చేయాలి
సింహాచల ఘటనపై మండిపడుతున్న హిందుత్వ సంఘాలు
2015 నుంచి ఇప్పటి వరకూ చోటు చేసుకున్న అత్యంత బాధాకరమైన ఘటనలు పరిశీలిస్తే చంద్రబాబు పాలనలో ఆలయాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం కనబడుతోంది. మొత్తం అవినీతిమయం చేస్తున్నారు. దురదృష్ట ఘటనలు పునరావృతమవుతున్నా లెక్కలేనితనంతో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా భక్తుల మరణాలు పరిపాటిగా మారుతున్నాయి. ఈ మరణాలను సైతం చాలా చులకనగా చూస్తున్నారు. పుష్కరాలు, తిరుమల వైకుంఠ దర్శనం, ప్రస్తుతం సింహాచలం ఇలా ఎన్నో దుర్ఘటనలు చంద్రబాబు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సనాతన ధర్మమని చెప్పే వపన్కల్యాణ్తో పాటూ ధర్మం గురించి మాట్లాడే కూటమి పెద్దలు కూడా దీనికి సమాధానం చెప్పాలి. తాజాగా జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ దేవదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి.
– జ్వాలాపురం శ్రీకాంత్, మాజీ ప్రభుత్వ
సలహాదారుడు (ఎండోమెంట్)

ఈ పాపం చంద్రబాబుదే!