తాడిపత్రికి చేరుకున్న సమీరా | - | Sakshi
Sakshi News home page

తాడిపత్రికి చేరుకున్న సమీరా

May 2 2025 1:53 AM | Updated on May 2 2025 1:53 AM

తాడిప

తాడిపత్రికి చేరుకున్న సమీరా

తాడిపత్రి టౌన్‌: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు, సైక్లిస్ట్‌ సమీరాఖాన్‌ మహిళా సాధికారత కోసం అనంతపురం నుంచి నేపాల్‌ వరకూ చేపట్టిన సైకిల్‌ యాత్ర గురువారం తాడిపత్రికి చేరుకుంది. ఈ సందర్భంగా జేసీ నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 37 దేశాల్లో సైకిల్‌ యాత్రలు, 11 పర్యాయాలు ఎతైన పర్వతాలను అధిరోహించినట్లు గుర్తు చేశారు. ప్రతి సాహసం వెనుక ఓ సదుద్దేశం ఉందన్నారు. ప్రస్తుతం అనంతపురం నుంచి నేపాల్‌కు 3,500 కి.మీ. సైకిల్‌ యాత్రలో మార్గమధ్యంలోని ప్రతి గ్రామంలోనూ మహిళా సాధకారతపై ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుతానన్నారు. తన ఈ యాత్ర దాదాపు 70 రోజుల్లో పూర్తవుతుందన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

నార్పల: క్షేత్ర దర్శనానికి వచ్చిన పలువురు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ జిల్లా కడప, ప్రొద్దుటూరుతో పాటు తాడిపత్రికి చెందిన పలువురు గురువారం నార్పల మండలం గూగూడులో వెలసిన కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకునేందుకు వచ్చారు. పూజాదికాలు ముగించుకున్న అనంతరం అక్కడే విందులో పాల్గొని పేకాట మొదలు పెట్టారు. విషయాన్ని పసిగట్టిన ఎస్పీ జగదీష్‌ ఆధీనంలోని ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుని పేకాట ఆడుతున్న దాదాపు 29 మందిని అదుపులోకి తీసుకుని, నార్పల పీఎస్‌కు తరలించారు. జూదరుల నుంచి రూ.8,98,410 నగదు, 28 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాగర్‌ తెలిపారు.

ఎన్‌సీసీ విద్యార్థులతో

కమాండర్‌ ముఖాముఖి

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులతో కర్నూలు ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ అలోక్‌ త్రిపాఠి గురువారం ముఖాముఖి నిర్వహించారు. క్రమశిక్షణ, నాయకత్వం, జాతీయ సేవ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కేడెట్ల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం వివిధ ఎన్‌సీసీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం, సమాజ సేవ, అడ్వెంచర్‌ శిక్షణ, జాతీయ సమైక్యత శిబిరాల్లో పాల్గొన్న కేడెట్లను అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఈఎస్‌ అహమ్మద్‌, ఎన్‌సీసీ అధికారులు డాక్టర్‌ ఎం. రామాంజనేయులు, జి. చిన్నవెంకటమ్మ పాల్గొన్నారు.

దాడి ఘటనలో ముగ్గురి అరెస్ట్‌

తాడిపత్రి టౌన్‌: స్థానిక గాంధీనగర్‌లో గత ఏడాది డిసెంబర్‌ 15న కుళ్లాయమ్మ, ఆమె కొడుకులపై అదే ప్రాంతానికి చెందిన పవన్‌, పుల్లయ్య, మహేష్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సాయిప్రసాద్‌ తెలిపారు.

తాడిపత్రికి చేరుకున్న సమీరా 1
1/2

తాడిపత్రికి చేరుకున్న సమీరా

తాడిపత్రికి చేరుకున్న సమీరా 2
2/2

తాడిపత్రికి చేరుకున్న సమీరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement