
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
అనంతపురం అర్బన్: ‘రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలి. యువత మత్తుబారిన పడకుండా చూడాలి’. అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ పి.జగదీష్తో కలిసి అధికారులతో రోడ్డు భద్రత, నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆటోలు, వాహనాలు ఓవర్ లోడింగ్తో ప్రయాణించకుండా చూడాలని ఆదేశించారు. మత్తు, మాదకద్రవ్యాలకు యువత బానిస కాకుండా చూడల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. మత్తు ప్రదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజగోపాల్, డీటీసీ వీర్రాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
ఆర్టీసీ బస్టాండుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణిలకులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో ప్రతి వార్డులోనూ చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కలెక్టర్ వినోద్కుమార్