అనంతపురం: ఐపీఎల్ తరహాలో సాగుతున్న ఏపీ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టు కాకరేపుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏపీ సూపర్ కప్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి 8 జోన్లుగా, 8 క్లబ్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టులో ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ కం నాకౌట్ పద్థతిలో సాగుతున్న ఈ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ల్లో అన్నింటా విజయం సాధించి కొల్లేరు క్లబ్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో నల్లమల క్లబ్ జట్టుపై తలపడిన విశాఖ క్లబ్... 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో తుంగభద్ర క్లబ్పై ఏకంగా ఐదు గోల్స్ సాధించి గోదావరి క్లబ్ జట్టు (5–0) విజయం కై వసం చేసుకుంది. కొల్లేరు–కోరమాండల్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్లో 2–0 గోల్స్ తేడాతో కొల్లేరు క్లబ్ విజయకేతనం ఎగురవేసింది.
ఆయుష్ జిల్లా కమిటీ ఎన్నిక
అనంతపురం మెడికల్: రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతపురంలోని గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఆయుష్ దక్షిణాది రాష్ట్రాల కో ఆర్డినేటర్ డాక్టర్ వీరబోయిని నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోగుల కుమారయ్య, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ శాంతిప్రియ, డాక్టర్ వీఎన్ రజితయాదవ్ ఆధ్వర్యంలో ఆయుష్ జిల్లా కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. జిల్లా కమిటీ గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ బి.కేదార్నాథ్, అధ్యక్షుడిగా డాక్టర్ ఎస్.శ్రీనివాసనాయక్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్.చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్.గౌరీశంకర్, కోశాధికారిగా డాక్టర్ టి.మురళీకృష్ణ, సహాయ కార్యదర్శిగా డాక్టర్ బి.రఘుభూపాల్ రెడ్డి, డాక్టర్ టి.రియాజ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్ మల్లికార్జున గౌడ్, డాక్టర్ రామాంజినేయులు, డాక్టర్ ఎన్.షెక్షావలి, డాక్టర్ జీవీ నీలేష్, డాక్టర్ ఎస్.మహమ్మద్ రఫిక్, డాక్టర్ నరసింగరావు ఎన్నికయ్యారు.
కాకరేపుతున్న ‘కొల్లేరు’