
మహానాడు కాదది.. దగానాడు
అనంతపురం కార్పొరేషన్: అలివిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదని, కడపలో టీడీపీ నిర్వహించేది మహానాడు కాదని.. దగా నాడుగా ప్రజలు భావిస్తున్నారని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చలేదన్నారు. కనీసం ఇప్పటికై నా రాష్ట్రాభివృద్ధిపై తీర్మానాలు చేయించేలా చూడాలని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందన్నారు. కక్ష సాధింపులకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజుతో పాటు బడుగులు, దళితులపై పోలీసులు సాగించిన చౌర్జన్యంపై మహానాడులో చర్చించగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ పేరుతో ఇచ్చిన చంద్రబాబు హామీల్లో ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. డబ్బులు లేవంటూనే ఏడాదిలో రూ.50 వేల కోట్లు మిగుల్చుకున్నారన్నారు. మొత్తమ్మీద ఒక్క ఏడాదిలోనే రూ.1,30,000 కోట్లు, అమరావతి పేరుతో రూ.30 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. ఏఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒకే ఏడాది లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాకు 2013లో ఎయిమ్స్ మంజూరైతే..దానిని మంగళగిరికి తరలించి జిల్లాకు అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు హైకోర్టు బెంచ్ తీసుకువస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని, జిల్లాలో 20 లక్షల ఎకరాలకు విత్తన వేరుశనగ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీడీపీ వారసులెవరు?
టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి అధికారంలోకి తీసుకువస్తే.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి తానే అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించుకున్న అంశంలో నేరపూరితమైన భావన కన్పించడం లేదా అని ప్రశ్నించారు. పార్టీకి అసలు వారసుడు బాలకృష్ణ దబిడిదిబిడే అంటూ తిరుగుతున్నాడని, మరొకరు (కుమార్తె) బీజేపీలో కొనసాగిస్తారో... తొలగిస్తారోనని ఆలోచిస్తున్నారని, ఇక జూనియర్ ఎన్టీఆర్ అవునా, కాదా అనే మీమాంశతోనే సరిపోతోందన్నారు. కార్పొరేట్కు సాగిలపడిన చంద్రబాబు.. తన స్వలాభానికి ప్రజల భూములను పావలా, అర్ధరూపాయికి కట్టబెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్