అనంతపురం కార్పొరేషన్: భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ ఓ పొలిటికల్ జోకర్ అని యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్కుమార్ యాదవ్ విమర్శించారు. మంగళవారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం, గ్రానైట్ తదితర వాటిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.1,65,000 కోట్లు వెనకేసుకున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తూ..పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రూ.వంద కోట్లు దాటిన కాంట్రాక్ట్ పనులు జ్యుడీషియరీ రివ్యూకు వెళతాయన్న ఆలోచన కూడా రామచంద్ర యాదవ్కు లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రామచంద్ర యాదవ్కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వచ్చిన మెజారిటీలో సగం ఓట్లు కూడా రాలేదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో ఎన్నడూ లేని సంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ పెత్తందారుల పార్టీల వైపు వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన సామాజిక న్యాయం కన్పించలేదా అని ప్రశ్నించారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బడుగులకు పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టు పనుల్లో భాగస్వామ్యం కల్పించి గొప్ప సామాజిక న్యాయం చేశారని కొనియాడారు.