అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
బాధితులకు అండగా నిలిచిన
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
న్యాయం జరిగేంతవరకు పనులు నిలుపుదలకు డిమాండ్
మునగపాక : రైతుల నుంచి ఎటువంటి భూమి సేకరించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను ఎలా తవ్వేస్తారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ధ్వజమెత్తారు. రైతులకు ప్రత్యామ్నాయం చూపించి సాగునీటి కాలువ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతవరకు పనులు జరగకుండా చూడాలని తహసీల్దార్ సత్యనారాయణను కోరారు. వివరాలివి. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా మునగపాక మండలం గంగాదేవిపేట నుంచి మున గపాక జంక్షన్ వరకు వచ్చే మార్గంలో ఇరువైపులా సాగునీటి కాలువలు ఉండేవి. రహదారి విస్తరణలో ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారా వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతూ వచ్చేది. అయితే విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలో రిటైనింగ్ వాల్ నిర్మించే క్రమంలో పొక్లెయిన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సమస్యను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన గురువారం సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు జరుగుతున్న అన్యాయం గుర్తించి సమస్యను తహసీల్దార్ సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను తవ్వేసే కార్యక్రమం ఎలా చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణకు తాము సమ్మతమేనని అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచన లేకుండా రైతులకు నష్టం వాటిల్లేలా పనులు చేపట్టడం సరికాదన్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి మహేష్, దాడి శివ, సీపీఎం నేత ఎస్.బ్రహ్మాజీ, రైతులు పాల్గొన్నారు.


