20 మంది బైండోవర్
మాట్లాడుతున్న సీఐ అల్లు స్వామినాయుడు
కశింకోట: మండలంలోని జి.భీమవరం, శివారు సింగవరం గ్రామాలకు చెందిన 20 మంది ప్రతినిధులను ముందు జాగ్రత్తగా బైండోవర్ చేసినట్లు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రాత్రి రెండు గ్రామాలకు చెందిన ప్రతినిధులను హాజరుపరిచారు. సీఐ మాట్లాడుతూ జి. భీమవరం, సింగవరం గ్రామాల విభజన ప్రతిపాదన, గంగదేవి తల్లి జాతర నిర్వహణ విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో రెండు గ్రామాలకు చెందిన చెరో పది మందిని ముందు జాగ్రత్తగా బైండోవర్ చేశామన్నారు. ఈ నెల 27న జాతరను గతంలో వలె ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఎటువంటి హింసాత్మక చర్యలు, గొడవలు, అల్లర్లు సృష్టిస్తే సహించబోమన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల ఆదేశాలు ధిక్కరిస్తే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ తిరుమలరావు రెండు గ్రామాల ప్రతినిధులతో వివాదం ఏర్పడకుండా చర్చించారు.


