నేడు సింహాచలంలో రథసప్తమి
● నిత్యకల్యాణం మినహా మిగతా
ఆర్జిత సేవలన్నీ రద్దు
సింహగిరిపై ఉన్న రాతిరథం
సింహాచలం: సింహగిరిపై ఆదివారం రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ హంసమూలన ఉన్న రాతి రథాన్ని అందంగా అలంకరించారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్సవమూర్తులైన గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆదివారం ఉదయం 6.30 గంటలకు రాతిరథంపై వేంచేపు చేస్తారు. అనంతరం స్వామి వారికి విశేషంగా అభిషేకాలు, అరుణ పారాయణం నిర్వహిస్తారు. అలాగే, ఉదయం 10 గంటలకు రాతిరథంపైనే నిత్యకల్యాణం జరిపిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి సింహగిరి మాడవీధుల్లో సూర్యప్రభ వాహనంపై స్వామి వారికి తిరువీధి నిర్వహిస్తారు. ఈసారి రథసప్తమి, ఆదివారం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఆర్జిత సేవలు రద్దు..: రథసప్తమి రద్దీ దృష్ట్యా ఆదివారం ఒక్క నిత్యకల్యాణం మినహా మిగతా ఆర్జి త సేవలన్నీ రద్దు చేశారు. స్వర్ణ పుష్పార్చన, గరుడసేవ, సహస్రనామార్చన, లక్ష్మీనారాయణ వ్రతాలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
గోశాలలో..: సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో కూడా రథసప్తమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. గోశాలలో ఉన్న సప్త అశ్వవాహన సమేత సూర్యనారాయణస్వామి వారి భారీ విగ్రహం వద్ద ఉదయం 5.30 గంటల నుంచి విశేష పూజలు జరపనున్నారు.


