టీడీపీలో ‘మూడు’ ముక్కలాట
సాక్షి, అనకాపల్లి : పచ్చనేతల్లో విభేదాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద్, అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు మధ్య విభేదాలు తారస్థాయి చేరుకోగా..ఇప్పుడు మూడో వర్గం కూడా తయారైంది. గతంలో చంద్రబాబు పర్యటనలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా ఇద్దరూ ఒకరిపై మరొకరు పార్టీ అధినేత దగ్గర రహస్యంగా ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నెల 18న ఆదివారం నాడు జరిగిన ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పచ్చనేతల్లో విభేదాలు బట్టబయలయ్యాయి. తొలుత అనకాపల్లి టౌన్లో గల ఎన్టీఆర్ చౌక్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు దాడి రత్నాకర్ నివాళులర్పించారు. వారు వెళ్లిన వెంటనే నియోజకరవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పాటు జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, నియోజవర్గ టీడీపీ నాయకులు, చివరిగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ వెళ్లి నివాళులర్పించారు. పీలా గోవింద్తోనే సఖ్యతగా ఉండే నాగ జగదీష్ తరు వాత వారితో కలిసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పీలాదే పై చేయి..
వీరివురిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వర్గీయులదే పైచేయిగా స్పష్టమైంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుతో పాటు నియోజకవర్గంలో ఉన్న మెజారిటీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పీలాతోనే కలిసి వెళ్లి నివాళులర్పించారు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయులు, వర్గీయులు 20 మంది తప్ప వారితో పాటు పెద్దగా టీడీపీ కేడర్ వెళ్లలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమానికి మాజీ మంత్రి దాడి, ఆయన కుమారుడు రత్నాకర్ హడావుడి చేయడం, ఎన్టీఆర్ వర్థంతికి మూడు రోజుల ముందుగానే ఎన్టీఆర్ చౌక్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద చిన్నపాటి మరమ్మతులు చేసి, అక్కడ ప్లెక్సీలు, పోస్టర్లు పెడితే చించేస్తా అంటూ మీడియా ముందు మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఎన్టీఆర్ రాజకీయ భిక్షతో ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు పొందిన దాడి వీరభద్రరావుకు కొన్నేళ్లుగా ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి గుర్తుకు రాలేదా..? టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ పై అమిత ప్రేమ పుట్టుకొచ్చిందా..? అంటూ పీలా వర్గీయులు మండిపడుతున్నారు.
‘దాడి’ని ఆహ్వానిస్తే సహించం....
ఎన్టీఆర్ వర్ధంతికి మాజీ మంత్రి ‘దాడి వీరభద్రరావును ఆహ్వానిస్తే సహించేది లేదని జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబుకు అనకాపల్లి నియోజవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద్ సత్యనారాయణ గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో జిల్లా, నియోజకవర్గ నాయకులు ‘దాడి‘ని వర్ధంతికి ఆహ్వానించలేదని సమాచారం. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను ఆహ్వానించిన టీడీపీవారు నియోజకవర్గంలో అనేక చోట్ల ఎమ్మెల్యేతోనే ఎన్టీఆర్కు నివాళులు అర్పించి ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, నియోజవర్గ సమన్వయకర్త పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కార్పొరేటర్ భర్త మాదంశెట్టి నీలబాబుతోపాటు టీడీపీ శ్రేణులు పాల్గొనడం జిల్లాలో చర్చకు తావు తీసింది. చివరగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు వచ్చినా ఎవరితో సంబంధం లేకుండా రెండు వర్గాలతో పనిలేకుండా తానే ఎన్టీఆర్కు నివాళులర్పించడం గమనార్హం.
టీడీపీలో ‘మూడు’ ముక్కలాట


