అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు
తుమ్మపాల: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, భూసమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో వేర్వేరుగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు వివిధ మండలాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్య పరిష్కరించాలన్నారు. డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి అర్జీదారులకు అందుకు గల కారణాలు వివరంగా తెలియజేస్తే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చని కలెక్టర్ చెప్పారు. పీజీఆర్ఎస్కు 91, రెవెన్యూ క్లినిక్కు 218 మొత్తం 309 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, మనోరమ, రమామణి, అనిత, సీపీవో జి.రామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బకాయిల కోసం
చోడవరం సుగర్స్ రైతుల ఆందోళన
తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరుతూ చోడవరం కో–ఆపరేటివ్ సుగర్స్కు చెందిన చెరకు రైతులు జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 2024–2025 క్రషింగ్ సీజన్లో షేర్ హోల్డర్ రైతులు సుమారు 1,08,000 మెట్రిక్ టన్నుల చెరకు సరఫరా చేయగా, 5 వేల టన్నుల పంచదార ఉత్పత్తి జరిగిందని రాజు చెప్పారు. రైతులకు రూ.32 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఫ్యాక్టరీ యాజమాన్యం కేవలం రూ.5.83 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారని, . రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఫ్యాక్టరీ వద్ద ఉన్న పంచదార నిల్వలను విక్రయించి రైతుల బకాయిలు చెల్లించాలని ఆదేశించినా ఫలితం లేదన్నారు. కలెక్టర్ తక్షణ విచారణ జరిపి, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రైతులకు మొత్తం బకాయిలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పీలా మహేష్, పిల్ల నూకునాయుడు, అల్లం రామ అప్పారావు, ఏడువాక నూకరాజు, గోగుల సతీష్, ముమ్మిడిశెట్టి రాజు, ఆడారి రమణ మాలినాయుడు, మంగ శ్రీను, గండ్రేడ్డి కళ్యాణ్, గంగాధరరావు, గంటా సన్యాసినాయుడు, వేగి మహాలక్ష్మినాయుడు, దొడ్డి ప్రసాద్, కాళ్ళ పరమేష్ పాల్గొన్నారు.
దాడిని ఖండిస్తూ నిరసన
తనపై దాడి చేసిన అమృతపురం గ్రామానికి చెందిన బి.రామారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సబ్బవరం మండలం చింతగట్లకు చెందిన దివ్యాంగుడు రాయవరపు అప్పలనాయుడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నెల 8న గ్రామంలో జరిగిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంచినీటి సౌకర్యం కోసం ఇరువురి మధ్య ఏర్పడిన ఘర్షణలో రామారావు తన చేతిలో ఫోన్ లాక్కుని దాడి చేశారని, వికలాంగుడినంటూ హేళనగా మాట్లాడారని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని అప్పలనాయుడు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నిరసనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు మద్దుతు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘాల నాయకులు అక్కిరెడ్డి అప్పారావు, బి.నూకఅప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు
అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు


