వీఆర్‌ఎస్‌పై అయోమయం | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఎస్‌పై అయోమయం

Jun 30 2025 4:06 AM | Updated on Jun 30 2025 4:06 AM

వీఆర్‌ఎస్‌పై అయోమయం

వీఆర్‌ఎస్‌పై అయోమయం

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం రెండో విడత ప్రకటించిన వలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌) దరఖాస్తు విషయంలో ఉద్యోగుల్లో అయో మయం నెలకొంది. మూడో బ్లాస్ట్‌ఫర్నేస్‌ ప్రారంభించినందున ప్లాంట్‌ పరిస్థితులు బాగుపడే అవకాశం ఉందని ఉద్యోగులు ఒకవైపు ఆశావాహంగా ఆలోచిస్తుండగా.. రానున్న రోజుల్లో మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న భయం మరోవైపు వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ వీఆర్‌ఎస్‌ పట్ల ఉద్యోగులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, ఆర్థిక సదుపాయాల కోత వంటి కారణాల వల్ల ఈ ఏడాది మార్చి నెలలో వచ్చిన మొదటి వీఆర్‌ఎస్‌కు స్పందన లభించింది. అప్పట్లో కూడా వీఆర్‌ఎస్‌ పరిహారం, పీఎఫ్‌, గ్రాట్యుటీ, లీవ్‌ శాలరీ మొత్తం ఇస్తారా... లేదా అనే సందేహాలతో 1,613 మంది మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. యాజమాన్యం వారికి సకాలంలో అన్నీ చెల్లించడంతో అప్పుడు దరఖాస్తు చేయనివారు తప్పు చేశామన్న భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో పెరిగిన పని ఒత్తిడి, పూర్తి జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి వీఆర్‌ఎస్‌ వస్తే కనీసం మూడు వేల మంది దరఖాస్తు చేస్తారని అందరూ ఊహించారు. అయితే అంత స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత బడ్జెట్‌లో మిగిలిన సొమ్ము మేరకు మాత్రమే ఈసారి వీఆర్‌ఎస్‌ ఇస్తారని, ఊహాగానాలు వినిపించడం, ఇప్పటికే సిబ్బంది బాగా తగ్గిన నేపథ్యంలో చాలా విభాగాల్లో విభాగాధిపతులు వచ్చిన దరఖాస్తులను అంగీకరించేది లేదని చెబుతుండడంతో చాలా మంది డీలా పడి దరఖాస్తు చేయనట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటివరకు 850 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. అయితే జూలై 15 వరకు గడువు ఉన్నందున చివరలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తున్నది.

స్టీల్‌ప్లాంట్‌ ముఖ చిత్రం

ముందుకురాని స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు

ఇప్పటివరకు కేవలం 850 దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement