
దిక్కెవరు?
శ్రీరాముని భూమికి
విస్తుపోయిన దేవదాయ శాఖ అధికారులు
ఎస్.రాయవరం: యలమంచిలి దేవదాయ డివిజన్ కార్యనిర్వహణాధికారి పరిధిలో ఎస్.రాయవరం మండలం సైతారుపేట గ్రామంలోని శ్రీరామాలయానికి సర్వే నంబరు 141లో 1.04 ఎకరాల భూమి ఉంది. గ్రామానికి చెందిన వీసం సన్యాసినాయుడు కుటుంబం ఈ భూమిని ఆలయానికి రాసిచ్చింది. ఈ భూమికి ఆనుకుని ఓ అధికార పార్టీ నాయకుడి ఇల్లు ఉంది. ఆ నాయకుడి ఇంటికి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రహదారి నిర్మించడం కోసం ఆలయ భూమి ఆక్రమణకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా దేవదాయ జిల్లా అధికారిణికి స్థానిక టీడీపీ నేత ఈ రహదారి నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటారో చూస్తాను అంటూ చెప్పి మరీ సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. దీన్ని సీరియస్గా పరిగణించిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భవిష్యత్తులో ఈ ఆలయ భూమిలో క్రమంగా మరిన్ని ఆక్రమణలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించి చర్యలకు ఉపక్రమించారు.
పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు
సైతారుపేట శ్రీరామాలయం భూమిలో గ్రామానికి చెందిన టీడీపీ నేత దౌర్జన్యంగా రహదారి నిర్మాణం చేస్తున్నారంటూ యలమంచిలి దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ డి.ఉమాదేవి ఈ నెల 11న రాత పూర్వకంగా ఎస్.రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణ నిలుపుదల చేయాలని, దీనికి బాధ్యులెవరనేది ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా పోలీసులు స్పందించలేదు. సైతారుపేట రామాలయానికి ఉన్న 1.04 ఎకరాలకు సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని కోరుతూ యలమంచిలి దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కె.సాయివెంకట తేజ.. ఎస్.రాయవరం తహసీల్దార్కు ఈ నెల 20న మీసేవ ద్వారా దరఖాస్తు చేయడంతో పాటు అధికారికంగా లేఖ ద్వారా కోరారు. రెవెన్యూ అధికారులు కూడా స్పందించకపోవడంతో ఆక్రమణదారులు ఇప్పటికే ఆలయ భూమిలోంచి పంచాయతీ చెత్తతో రహదారి నిర్మాణం కోసం పూనుకున్నారు.
దేవుని భూమిని కాపాడాలి
మా తాత వీసం సన్యాసినాయుడు శ్రీరామునిపై భక్తితో ఇక్కడ భూమిని రాసిచ్చారు. సదుద్దేశంతో ఇచ్చిన భూమిని ఇక్కడ కొందరు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. పంచాయతీ పాలకుల సపోర్టుతోనే ఇదంతా జరుగుతోంది. దేవుని భూమిలో రహదారి నిర్మాణానికి పంచాయతీ పాలకులు ఎలా ఆమోదం చెబుతారు. కళ్లముందే మా కుటుంబం ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూమిని ఆక్రమించుకుంటున్నారు. గతంలోనే దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాను. ఆలయ భూమిని ఆక్రమించుకోవడం దురదృష్టకరం. అధికారులు ఆక్రమణను ఆపాలి.
– వీసం వెంకట లలిత, ఆలయ ట్రస్టీ
సైతారుపేట శ్రీరామాలయం భూమిని ఆక్రమించుకుని వేస్తున్న రహదారి
సైతారుపేటలో ఆలయ భూమిలో రహదారి నిర్మాణం
రెవెన్యూ, పోలీసులకు దేవదాయ శాఖ అధికారుల ఫిర్యాదు
అధికార పార్టీ నేత ఒత్తిడితో ఆక్రమణకు ప్రోత్సాహం
ఆలయ భూమికి గురువారం సర్వే చేస్తామని సచివాలయ సర్వేయర్ దేవదాయ శాఖ అధికారులకు నోటీసు ఇచ్చారు. ఈ మేరకు దేవదాయ అధికారులు, శ్రీరామాలయం ట్రస్టీ గురువారం ఉదయం భూమి వద్దకు చేరుకున్నారు. అయితే సర్వేయర్ మాత్రం భూమికి సర్వే చేయడానికి వీలుపడదని, సర్వే చేయాల్సిన భూమి హద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు ఇవ్వలేదని చెప్పడంతో దేవదాయ శాఖ అధికారులు కంగుతిన్నారు. సర్వే ప్రొసీజర్ ప్రకారం హద్దుల్లో ఉన్న వారికి కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉండగా సచివాలయ సర్వేయర్ ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేసి ఆక్రమణకు సహకరించడానికే చూస్తున్నారని శ్రీరామాయలం ట్రస్టీ వీసం వెంకట లలిత ఆరోపించారు. రెవెన్యూ అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అందరికీ నోటీసులు ఇచ్చి భూమికి సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తామని సర్వేయర్ చెప్పారు.
దీంతో దేవదాయ శాఖ అధికారులు చేసేదేమీలేక అక్కడ్నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. ఆలయ భూమి ఆక్రమణను అడ్డుకోవడానికి యత్నిస్తున్న దేవదాయశాఖ అధికారులకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహాయ నిరాకరణ చేయడం, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిక్కెవరు?