
మత్తు వదలి.. ముందుకు కదిలి..
డ్రగ్స్ రహిత సమాజం కోసం అనకాపల్లిలో వాకథాన్
అనకాపల్లి:
మాదక ద్రవ్యాలను అరికట్టాలని, ప్రజల్లో చైతన్యం తేవాలని అనకాపల్లిలో గురువారం భారీ స్థాయిలో వాకథాన్ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీని కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా ఎకై ్సజ్ సహాయ కమిషనర్ సూర్జిత్ సింగ్ ప్రారంభించారు. విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ క్రీడామైదానానికి చేరుకొని ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసే ఉద్దేశంతో విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని, వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికిపోతున్నారని చెప్పారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం అరికట్టేందుకు 5 స్టాటిక్ చెక్పోస్టులు, 38 డైనమిక్ చెక్పాయింట్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలతో నిఘా ముమ్మరం చేశామన్నారు.
జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలాజీ, ఆర్డీవో షేక్ ఆయిషా, డీఎస్పీ శ్రావణి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి సుజాత, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, సీఐలు టి.వి.విజయకుమార్, ఎం.వెంకటనారాయణ, గఫూర్, చంద్రశేఖర్, బాల సూర్యారావు, లక్ష్మి, అశోక్ కుమార్, అల్లు స్వామినాయుడు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కాలేజీ, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మత్తు వదలి.. ముందుకు కదిలి..