
మృత్యువుతో పోరాడి ఓడారు
● లంకెలపాలెం లారీ బీభత్సం ● ఐదుకు చేరిన మృతుల సంఖ్య
పరవాడ/రావికమతం: లంకెలపాలెం కూడలిలో మార్కెట్ లారీ సృష్టించిన బీభత్సంలో విషాదం కొనసాగుతోంది. ఈ నెల 23న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వేర్వేరు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. మృతులను కంటైనర్ డ్రైవర్ రేఖ అప్పలరాజు(విజయరాంపుర అగ్రహారం, రాంబిల్లి మండలం), వాహనచోదకుడు సాలాపు రాంకుమార్ (కొత్తకోట, రావికమతం మండలం)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అప్పలరాజు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో, రాంకుమార్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, ప్రమాదం జరిగిన రోజే అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చెంనాయుడు, రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, అగనంపూడి వాసి ఎర్రప్పడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొంత మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు.

మృత్యువుతో పోరాడి ఓడారు