
వసతి గృహ విద్యార్థినులపై కుక్క దాడి
● ఏడుగురికి గాయాలు
నాతవరం ఆస్పత్రిలో బాధిత విద్యార్థినులు
నాతవరం: మండలంలోని తాండవ గిరిజన బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థినులపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు విద్యార్థినులు గాయపడ్డారు. ఇక్కడ వసతి గృహం వద్ద అదనపు భవనం నిర్మాణం కోసం కొంతమేర ప్రహరీ తొలగించారు. దాంతో కుక్క లోపలకు చొరబడి ఒక్కసారిగా విద్యార్థినులపై దాడికి పాల్పడింది. కె.బాబి, కె.రమ్య, జంప దుర్గ, జంప వశిష్ట, కె.మీనాక్షి, కె.నారిముని, టి.భానుమతి గాయపడ్డారు. వీరిని వసతి గృహ సిబ్బంది నాతవరం పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్సనందించి అనంతరం నర్సీపట్నం సీహెచ్సీకి తీసుకెళ్లి మరో వ్యాక్సిన్ వేయించారు.