
సచివాలయ ఉద్యోగుల మెడపై బదిలీ కత్తి
●ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగుల సంఖ్య 3,464 ●బదిలీ షెడ్యూల్.. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు
సాక్షి, అనకాపల్లి: సచివాలయాల్లో ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని బదిలీ చేయాలన్న నిబంధనను కూటమి నేతలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఉద్యోగుల మెడపై బదిలీ కత్తి వేలాడదీసి వారిని లొంగదీసుకునేందుకు ఆయుధంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే పైనుంచి అనధికార ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. స్థానిక కూటమి నేతలు ఔనన్న వారిని, ఎమ్మెల్యే రికమండేషన్ ఉన్న వారిని కోరిన చోట నియమించాలని చెప్పడంతో పలువురు సచివాలయ ఉద్యోగులు నాయకుల చుట్టూ ప్ర దక్షిణలు మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియమించిన సచివాలయ ఉద్యోగులంటే గుర్రుమీదున్న కూటమి నేతలు బదిలీ అవకాశాన్ని కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. సొంత మండలాల్లో పనిచేయకూడదన్న నిబంధన అందులో భాగ మేనంటున్నారు. బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఆఫ్లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఐదేళ్లు పూర్తయితే బదిలీ..
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఐదేళ్లపాటు పనిచేసిన ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు 2020 అక్టోబరులో కొందరు, నవంబరులో మరికొందరు విధుల్లో చేరారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తి చేస్తేనే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో చేరిన ఉద్యోగులకు మూడేళ్లు మా త్రమే పూర్తి కావడంతో వారి బదిలీకి అవకాశం లే దు. మ్యూచువల్, రిక్వెస్ట్, స్పౌజ్, అనారోగ్య స మ స్యలు ఉన్న వారు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మూడు గ్రేడ్లుగా విభజన..
సచివాలయాలను మూడు గ్రేడ్లుగా విభజించారు. 2,500 లోపు జనాభా ఉంటే ‘ఏ’ గ్రేడ్గా పరిగణిస్తారు. ఆ సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులే ఉండాలి. జనాభా 2,500–3,500 మధ్య ఉంటే ‘బి’ గ్రేడ్గా గుర్తిస్తారు, 7 లేదా 8 మంది ఉద్యోగులు ఉండాలి. ఇక 3,500కు పైగా జనాభా ఉన్న సచివాలయాలను సీ–గ్రేడ్గా పరిగణిస్తారు. ఈ సచివాలయంలో 8 మంది ఉద్యోగులు ఉండాలని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో 522 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. వివిధ విభాగాల్లో 3,824 మంది విధులు నిర్వహిస్తున్నారు. 465 సచివాలయాల్లో పనిచేస్తున్న ఐదేళ్లు దాటిన వారిని ప్రస్తుతం బదిలీ చేస్తున్నారు. వీటిలో ఏ గ్రేడ్ సచివాలయాలు 119, బీ–గ్రేడ్–165, సీ–గ్రేడ్– 181 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే 3464 మంది ఉద్యోగులకు బదిలీ కౌన్సెలింగ్ జరగనుంది.
ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే అనుకూల పోస్టింగ్
స్థానిక నేతలకు అంగీకారమైతేనే అక్కడ నియామకం
సచివాలయాల్లో ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ