
పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారమేదీ..!
256 దరఖాస్తుల స్వీకరణ
సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, పీజీఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమామణి, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాలరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించాలన్నారు. మొత్తం 256 అర్జీలు నమోదు కాగా రెవెన్యూ 125, సర్వే సెటిల్మెంట్ 21, పాఠశాల విద్య 17, పంచాయతీరాజ్ 13, విద్యుత్ శాఖ 12, పోలీస్ 10, మిగిలినవి వివిధ శాఖల్లో నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలాజీ, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావు నాయుడు, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుదీర పాల్గొన్నారు.
తుమ్మపాల: ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఇచ్చే అర్జీల పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యానికి ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ వేదిక బయట పలువురు వృద్ధులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ అర్జీలపై పరిష్కారం చూపకుండా పొంతన లేని సమాధానాలతో అధికారులు ముగించేస్తున్నారని, కొన్నింటికి కనీసం అర్జీదారులను కూడా సంప్రదించడం లేదని చెబుతున్నారు.
భూవివాదంపై ఫిర్యాదుకు స్పందన లేదు...
కోర్టులో ఉన్న భూమికి సోదరులు వారి పేరున ఆన్లైన్ చేసుకుని అన్యాయం చేయడంపై ఈ నెల 2న కలెక్టరేట్లో ఇచ్చిన ఫిర్యాదుకు నేటికీ స్పందన లేదని, అధికారులను అడుగుదామంటే సిబ్బంది అడ్డుకుని బయటకు తరిమేస్తున్నారని ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన కొర్ని అప్పలనర్శ సోమవారం పీజీఆర్ఎస్ వేదిక వద్ద సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులిచ్చిన భూమికి తన పేరున పత్రాలు లేవని, ఎమ్మార్వోకి డబ్బులిచ్చి వారి పేరున నమోదు చేయించుకుని అన్నదమ్ములు భూమిని లాక్కుంటున్నారని ఆమె రోధించింది. తన తల్లి మరణించడంతో తనకీ కష్టాలు వచ్చాయని, తన తల్లి మరణ ధ్రువీకరణ పత్రం కూడా తనకు ఇవ్వకుండా సోదరులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపింది. దీనిపై 20 రోజుల క్రితం కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు అందించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. అధికారులు తన మొర ఆలకించి గ్రామంలో విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
మత్స్యకార రైతులకు న్యాయం చేయాలి
విశాఖ, చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సేకరిస్తున్న శ్రీ కనకమహాలక్ష్మి సాగర మత్స్యపారిశ్రామిక సహకార సంఘం భూములకు నష్టపరిహారం మంజూరు చేసి నిరుపేద మత్స్యకార రైతులకు న్యాయం చేయాలని సంఘ రైతులు పీజీఆర్ఎస్లో డీఆర్వోకు విన్నవించారు. 1994లో నక్కపల్లి మండలం వేంపాడులో 44 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతులకు లీజుకిచ్చిందని, వాటినే నమ్ముకుని జీవిస్తున్నామని ఇప్పుడు భూములు సేకరించినప్పటికీ నష్టపరిహారం మంజూరు విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని, సొసైటీ భూములకు కూడా నష్టపరిహారం మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు.
భుక్తి లేకుండా చేశారు..
20 ఏళ్లుగా రాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్న తనను అర్ధంతరంగా తొలగించి కూటమి పార్టీ మహిళకు అప్పగించారని, తనకు జీవనాధారం చూపించాలని అనకాపల్లి మండలం శంకరం గ్రామానికి చెందిన కొలుసు లక్ష్మి పీజీఆర్ఎస్లో విన్నవించింది. పాఠశాలలో వంట పనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నానని పేర్కొంది. పాఠశాలకు ఇద్దరు పిల్లలే రావడంతో ఒక రోజు మాత్రమే ఇంటి దగ్గరే వంట చేసి తీసుకొచ్చానని, ఉపాధ్యాయులు హెచ్చరించడంతో తరువాత నుంచి పాఠశాలలోనే వంట చేస్తున్నప్పటికీ తనపై రాజకీయ ముసుగు పులిమి తొలగించారని, తన పని తనకు ఇప్పించి ఆదుకోవాలని ఆమె కోరింది.

పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారమేదీ..!