
ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● బయ్యవరం వద్ద ప్రమాదం ● బస్సు డ్రైవర్తో సహా 8 మందికి గాయాలు
కశింకోట: మండలంలో బయ్యవరం వద్ద సోమవారం ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ సహా 8 మంది గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం...నర్సీపట్నం నుంచి విశాఖ వెళుతున్న నర్సీపట్నం డిపో ఆర్టీసీ లగ్జరీ బస్సు బయ్యవరం సరోజిని పరిశ్రమ వద్ద ముందు వెళుతున్న ట్రాలీ లారీని బలంగా ఢీకొట్టింది. ట్రాలీ డైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా ఎడమ వైపునకు మలుపు తిప్పుతుండగా బస్సు వేగంగా వచ్చి ట్రాలీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ కె. కల్యాణ్కుమార్ సహా కొప్పిశెట్టి సత్యనారాయణ, గెడ్డం పద్మ, నమ్మి రాజ్కుమార్, పసుపులేటి ప్రభాకర్, మాకిరెడ్డి రామలక్ష్మి, పి.గంగాధర్, మాకిరెడ్డి నారాయణమూర్తి గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వేరే బస్సులో తమ గమ్యాలకు తరలి వెళ్లారు. ప్రయాణికుడు మాకిరెడ్డి నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాలీ, ఆర్టీసీ డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఎం. శ్రావణి సందర్శించారు. బస్సు రోడ్డుపై నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. క్రేన్ సహాయంతో బస్సును అడ్డు తొలగించి ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్దీకరించారు. అనకాపల్లిలో చికిత్స పొందుతున్న రోగులను సీఐ పరామర్శించారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది.

ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు