
మత్స్యకారుల సమస్యలపై కలెక్టర్కి వినతి
అచ్యుతాపురం రూరల్: పూడిమడక మత్స్యకార ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మ శ్రీనివాస్, చేపల శ్రీరాములు విన్నవించారు. సరైన వసతి, మౌలిక సదుపాయాలు కూడా లేని దుస్థితిలో సుమారు 20 వేల పైబడి జనాభా ఉన్న పూడిమడక మత్స్యకారులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురౌతున్నారన్నారు. గత ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలతో పూడిమడక తుపాను బిల్డింగ్లో ఏషియన్ పెయింట్స్ సహకారంతో వైద్య సేవలు అందేవన్నారు. పీహెచ్సీ, హోమియోపతి ఆస్పత్రులు ఉండేవని, కానీ ఇప్పుడు ఆ సేవలు నిలిపివేశారని తెలిపారు. తక్షణమే అధికారులు చర్యలు చేపట్టి పీహెచ్సీ, హోమియోపతి ఆసుపత్రి తెరిపించి ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు కూడా నిలిపివేశారని, వెంటనే హార్బర్ పనులు చేపట్టి మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడాలని కోరారు.