
యువతను నట్టేట ముంచిన కూటమి సర్కార్
● ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిఇవ్వకుండా వంచన ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శ
దేవరాపల్లి: రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శించారు. తారువలో సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ ఏడాది గడిచినా అమలు చేయకుండా యువతను మోసగించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ‘యువత పోరు’ పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువత తరలిరావడమే ఇందుకు నిదర్శనమన్నారు. 2014 ఎన్నికల్లోను ఇదే మాదిరిగా హామీలిచ్చి చంద్రబాబు యువతను మోసగించారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో వంచించిన కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.