అనకాపల్లి: కోడూరు పంచాయతీ పరిధి పీతపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కును శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనకాపల్లి కేంద్రంలో తొలి ఎంఎస్ఎంఈ పార్కును కోడూరులో ఏర్పాటు చేశామని, పారిశ్రామిక పార్కులో స్థలాలు పొందిన వారు వెంటనే యూనిట్ల స్థాపన మొదలు పెట్టాలని కోరారు. పార్కులో యూనిట్ల స్థాపనకు 171 మందికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. పార్కును రూ. 59.47 కోట్లతో అభివృద్ధి చేశామని, 250 ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కోడూరు గ్రామం నుంచి పీతపాలెం వరకు రెండు కిలోమీటర్ల రహదారిని రూ.79.42 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించామన్నారు. ఆర్డీవో షేక్ ఆయిషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు ఎస్.నరసింహారావు, డిప్యూటీ జోనల్ మేనేజరు సూర్యనారాయణ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు జి.నాగరాజారావు, తహశీల్దారు బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.