
జిల్లాలో 82 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్వో లక్ష్మణ్
నక్కపల్లి: జిల్లాలో జూన్, జూలై నెలల్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 82 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖాధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల్లో అటవీ భూముల శాతాన్ని పెంచాలన్నదే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 నర్సరీలు ఏర్పాటు చేసి పంపిణీకి మొక్కలు సిద్ధంగా ఉంచామన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పేపర్ మిల్స్, ఉద్యానవన శాఖ, డ్వామా, అటవీ శాఖల సమన్వయంతో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సరుగుడికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. 70 లక్షల సరుగుడు, మిగిలిన 12 లక్షలు పలు రకాల జాతులుంటాయన్నారు. పొలాల్లో సరుగుడు పెంపకానికి ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తామన్నారు. నర్సీపట్నం, అనకాపల్లి యలమంచిలి, చోడవరం రేంజ్ కార్యాలయాల పరిధిలో మొక్కల పెంపకంపై పర్యవేక్షణ చేస్తామన్నారు.