
ఏవోబీలోనూ సుధాకర్ కీలకపాత్ర
● మావోయిస్టు ఉద్యమ బలోపేతంలో
తనదైన ముద్ర
● ఏజెన్సీలో ఘటనలకు ఆయనే వ్యూహంరూపొందించే వారని ప్రచారం
సాక్షి,పాడేరు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ లక్ష్మీనరసింహచలం ఏవోబీలో ఉద్యమ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందారు. ఈ ప్రాంత ఉద్యమంతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. నల్లమల అడవుల నుంచి ఏవోబీలోకి ప్రవేశించిన ఆయన ఏవోబీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చేపట్టిన శాంతి చర్చల్లోను ఆయన పాల్గొన్నారు. ఒడిశాలోని సుంకి–సాలూరు ఏరియా కమిటీలో సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపారు. 2006లో అప్పటి విజయనగరం జిల్లా మక్కువ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రసమంతవలస అడవుల్లో సుధాకర్ పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అడవిలో సురక్షిత ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో అప్పటి పోలీసు పార్టీలు ఆయనను సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటినుంచి ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారారు. ఏవోబీ పరిధి రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగే మావోయిస్టు ఉద్యమ కార్యక్రమాలకు ఈయనే వ్యూహం రూపొందించేవారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనను కోల్పోవడం దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగానే చెప్పవచ్చు.