
కొత్తకోటలో నిలిచిన సచివాలయ సేవలు
రావికమతం : కొత్తకోటలోని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల్లేక ప్రభుత్వ పరమైన సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 15 వేలు పై బడి జనాభా ఉన్న కొత్తకోటలో మూడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయం–1 లో డిజిటల్ అసిస్టెంట్ , వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులు లేరు. వేసవి సెలవులు అనంతరం ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో చేరే విద్యార్థులకు కుల,ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం. అలాగే రేషన్కార్దుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులు లేకపోవడంతో ఆ సచివాలయం పరిధిలో పని జరగట్లేదు. రెండో, మూడు సచివాలయాల్లోనూ సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఒకటో సచివాలయం పరిధిలోని విద్యార్థులు, స్థానికులు స్ధానికులు వివిధ ధ్రువపత్రాలు, రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి రెండు, మూడు సచివాలయాలకు వెళ్లినా అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రకాష్రావు, వెంకటేశ్వర్లు, రమణబాబు తదితరులు చెబుతున్నారు.ఒకటో సచివాలయం పరిధిలోని వారంతా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో సచివాలయంలో సేవలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకన్నబాబు తెలిపారు.